సంగారెడ్డి, జూలై 24 (నవజ్యోతి న్యూస్) : గంగారం గ్రామంలోని ఫ్రీ ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టు భర్తీ ప్రక్రియలో తనకు అన్యాయం జరిగిందని మేదరి వరమ్మ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. తాను పీజీ వరకు విద్యాభ్యాసం పూర్తి చేయడంతో పాటు గతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యా వాలంటీర్గా సేవలందించానని, పోస్టుకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తనను ఎంపిక చేయలేదని ఆమె పేర్కొన్నారు. అర్హతలు లేని వ్యక్తికి ఉపాధ్యాయ పోస్టు కేటాయించారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఆ పోస్టుకు దరఖాస్తు చేసిన అభ్యర్థులందరి విద్యార్హతలు, అనుభవ ధ్రువపత్రాలు, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని అధికారులను కోరారు. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించలేదనే అనుమానాలు ఉన్నందున నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని, అర్హతల ఆధారంగా తనకు న్యాయం చేయాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

