ఆచూకీ తెలిపిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి
రామాయంపేట, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి): మెదక్ జిల్లా రామాయంపేటలో ముగ్గురు బాలురు ఒకేసారి అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. కాలనీలో కలిసి ఆడుకున్న బాలురు రాత్రికి ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు.
కేఎస్ఆర్ కాలనీకి చెందిన మెక్కొండ అశ్విని అలియాస్ సోనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆమె కుమారుడు ధనుష్ (13), అదే కాలనీకి చెందిన మనోజ్ (13), షేక్ సమీర్ (13)లు ఆగస్టు 6న రాత్రి 9 గంటల వరకు కాలనీలో ఆడుకుని అనంతరం ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయినట్లు తెలిపారు. ధనుష్, మనోజ్ రామాయంపేట ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి, షేక్ సమీర్ 9వ తరగతి చదువుతున్నాడు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ బాలరాజు దర్యాప్తు ప్రారంభించారు. సీఐ సైదా నాయక్ పర్యవేక్షణలో ప్రత్యేక గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాలుర ఆచూకీ కోసం అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ముగ్గురు బాలుర గురించి ఎవరికైనా సమాచారం తెలిసిన వెంటనే రామాయంపేట ఎస్ఐ బాలరాజు లేదా సీఐ సైదా నాయక్కు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో బాలురను త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు.

