📄 ePaper
Sunday, August 9, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్డీప్‌ఫేక్‌లపై కేంద్రం కొరడా.. మెటాకు కీలక ఆదేశాలు !

డీప్‌ఫేక్‌లపై కేంద్రం కొరడా.. మెటాకు కీలక ఆదేశాలు !

మార్ఫింగ్‌ చిత్రాలు, తప్పుడు పోస్టుల వ్యాప్తిని కట్టడి చేయాలి.. అల్గారిథమ్స్‌లో మార్పులు తప్పనిసరి..

న్యూఢిల్లీ, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి): సోషల్‌ మీడియా వేదికలపై పెరుగుతున్న డీప్‌ఫేక్‌లు, మార్ఫింగ్‌ చిత్రాలు, తప్పుడు సమాచారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ మెటా ఉపయోగిస్తున్న సాంకేతిక వ్యవస్థలపై కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) అధికారులతో చర్చలు జరిగాయి. ఫేక్‌, హానికర కంటెంట్‌ వేగంగా వ్యాప్తి చెందకుండా అల్గారిథమ్స్‌లో అవసరమైన మార్పులు చేయాలని మెటాకు సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

వైరల్‌ కాకముందే గుర్తింపు

డీప్‌ఫేక్‌ వీడియోలు, మార్చిన ఫొటోలు, తప్పుదోవ పట్టించే పోస్టులను ప్రారంభ దశలోనే గుర్తించే సామర్థ్యాన్ని పెంచాలని అధికారులు సూచించారు. ఒకసారి తప్పుడు కంటెంట్‌ విస్తృతంగా వ్యాపించిన తర్వాత తొలగించడం కంటే, దాని రీచ్‌ను ముందుగానే నియంత్రించే విధంగా ప్లాట్‌ఫారమ్‌ సిఫారసు వ్యవస్థలను మెరుగుపరచాలని స్పష్టం చేసినట్లు సమాచారం.

అధికారుల ఆదేశాలకు వేగంగా స్పందన

చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై ప్రభుత్వ అధీకృత సంస్థల నుంచి వచ్చిన ఆదేశాలను వేగంగా అమలు చేయాలని మెటాకు సూచించారు. అభ్యంతరకరమైన పోస్టులను గుర్తించడం, వాటిపై చర్యలు తీసుకోవడం, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహించాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు.

మెటా వ్యవస్థలపై సమీక్ష

సమావేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న కంటెంట్‌ మోడరేషన్‌, కృత్రిమ మేధ ఆధారిత గుర్తింపు వ్యవస్థలను మెటా ప్రతినిధులు వివరించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత విధానాలతో డీప్‌ఫేక్‌లు, ఇతర హానికర కంటెంట్‌ను పూర్తిగా అడ్డుకోవడం సాధ్యం కావడం లేదని అధికారులు అభిప్రాయపడినట్లు సమాచారం. గుర్తింపు, తొలగింపు, కంటెంట్‌ రీచ్‌ నియంత్రణలో మరింత పటిష్టమైన చర్యలు అవసరమని తేల్చిచెప్పారు.

భారత్‌ నిబంధనలు పాటించాల్సిందే

భారత్‌లో పనిచేస్తున్న సోషల్‌ మీడియా సంస్థలు దేశంలోని ఐటీ, డేటా సంబంధిత నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. డేటా నిర్వహణ, చట్టవిరుద్ధ కంటెంట్‌ తొలగింపు, వినియోగదారుల భద్రత వంటి అంశాల్లో నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించింది.

మరోసారి చర్చలు

తాజా సమావేశంతో వ్యవహారం ముగియలేదని, మెటా తీసుకోబోయే సాంకేతిక చర్యలపై మరింత చర్చించేందుకు మరో సమావేశం నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డీప్‌ఫేక్‌లు, ఏఐతో రూపొందించిన తప్పుడు కంటెంట్‌ పెరుగుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా సంస్థల బాధ్యతను మరింత పెంచే దిశగా కేంద్రం చర్యలు కొనసాగిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!