క్యాష్ డిస్పెన్సర్ స్లాట్లో టేప్, ప్లాస్టిక్ స్ట్రిప్.. డబ్బు బయటకు రాకుండా చేసి చోరీ
హైదరాబాద్, ఆగస్టు 13 (నవజ్యోతి ప్రతినిధి):
ఏటీఎంలలో నగదు చోరీకి కేటుగాళ్లు కొత్త పద్ధతిని ఎంచుకుంటున్నారు. క్యాష్ డిస్పెన్సర్
స్లాట్కు స్టిక్కీ టేప్ లేదా పలుచని ప్లాస్టిక్ స్ట్రిప్ అమర్చి నగదు బయటకు రాకుండా
చేసి.. కస్టమర్లు వెళ్లిన తర్వాత చిక్కుకున్న డబ్బును తీసుకెళ్తున్నారు. ఈ మోసాన్ని
‘ఏటీఎం క్యాష్ ట్రాపింగ్’గా పిలుస్తారు.
ఇటీవల ముంబైలోని భాండుప్లో ఇదే తరహా మోసం వెలుగుచూసింది. పలువురు ఖాతాదారుల
ఖాతాల నుంచి నగదు డెబిట్ అయినప్పటికీ ఏటీఎం నుంచి డబ్బులు రాకపోవడంతో ఫిర్యాదులు
అందాయి. సీసీటీవీ పరిశీలించిన పోలీసులు.. నిందితులు ఏటీఎం క్యాష్ స్లాట్లో
ప్లాస్టిక్ స్ట్రిప్ అమర్చి నగదును చిక్కుకునేలా చేసినట్లు గుర్తించారు.
కస్టమర్లు ఏటీఎం పనిచేయడం లేదని భావించి వెళ్లిపోయిన తర్వాత నిందితులు తిరిగి వచ్చి
నగదును తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు మహిళలు
సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
- ఏటీఎం ఉపయోగించే ముందు క్యాష్ స్లాట్ సరిగ్గా ఉందో పరిశీలించాలి.
- టేప్, ప్లాస్టిక్ స్ట్రిప్, గ్లూ లేదా ఇతర అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే లావాదేవీ చేయకూడదు.
- నగదు రాకపోయినా ఖాతా నుంచి డబ్బు డెబిట్ అయితే వెంటనే బ్యాంకును సంప్రదించి ఫిర్యాదు చేయాలి.
- అనుమానాస్పద పరికరాలను స్వయంగా తొలగించకుండా బ్యాంకు సిబ్బందికి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
ముఖ్యంగా.. ఏటీఎం నుంచి నగదు రాకపోయినా ఖాతాలో డబ్బు డెబిట్
అయినట్లయితే వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేసి, లావాదేవీ వివరాలను భద్రపరుచుకోవాలి.
అనుమానాస్పదంగా కనిపించే ఏ వస్తువునూ స్వయంగా తాకకపోవడం మంచిది.

