వైద్య సేవలు,మౌలిక వసతులపై సమీక్ష
రోగులతో మాట్లాడి సేవలపై అభిప్రాయాల సేకరణ
రామాయంపేట, జూలై 31 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) :
మెదక్ జిల్లా రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)ను జిల్లా పరిషత్ సీఈఓ శ్రీ ఎల్లయ్య శుక్రవారం సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, పరిశుభ్రత, మందుల లభ్యత, వైద్య సిబ్బంది పనితీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా వార్డులను సందర్శించిన సీఈఓ, చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. చికిత్సలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేలా సేవలు అందించాలని, పరిశుభ్రత, సమయపాలన, రోగుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.అనంతరం ఆసుపత్రి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి, ఆసుపత్రిలో అందుతున్న సేవలు, అవసరమైన సదుపాయాలు, ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీహెచ్సీ సూపరింటెండెంట్ డా.లింబాద్రి,వైద్యులు,నర్సింగ్ అధికారులు,ఆసుపత్రి సిబ్బంది, ఎంపిడిఓ షాజోలొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

