రామచంద్రపురం(న్యూ ఎంఐజి ), జులై 19(నవజ్యోతి ప్రతినిది ):
- పటాన్చెరు నియోజకవర్గంలోని విద్యుత్ నగర్ న్యూ ఎం ఐజి కాలనీ సొసైటీకి చెందిన భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయని ఆరోపిస్తూ, వాటిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాలనీ సభ్యుడు గుండాల ముఖేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం విద్యుత్ నగర్ వాటర్ ట్యాంక్ మెయిన్ సెంటర్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా గుండాల ముఖేష్ రెడ్డి మాట్లాడుతూ, విద్యుత్ నగర్ ఎంఐజీ ఫేజ్–2 కాలనీ 125 ఎకరాల విస్తీర్ణంలో బీహెచ్ఈఎల్ కో-ఆపరేటివ్ ఎంప్లాయీస్ హౌసింగ్ కాలనీగా ఏర్పాటైందని తెలిపారు. ప్రస్తుతం కాలనీలో సుమారు 1,924 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని చెప్పారు.
కాలనీ ఏర్పడినప్పటి నుంచి కో-ఆపరేటివ్ సొసైటీ ఏర్పడి ఇప్పటివరకు ఐదుసార్లు ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. అయితే ఈ కాలంలో సొసైటీకి చెందిన విలువైన భూములను తక్కువ ధరలకు లీజు పేరుతో ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థలకు అప్పగించారని ఆరోపించారు. లీజుల పేరుతో కాలనీ ఆస్తులను శాశ్వతంగా కోల్పోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాలనీ ఏర్పడి 26 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఫైనల్ లేఔట్ రాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. కాలనీకి కేటాయించాల్సిన 10 శాతం కమ్యూనిటీ భూమి అందుబాటులో లేకపోవడం వల్లే ఫైనల్ లేఔట్ పెండింగ్లో ఉందని కాలనీవాసులు చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు.
భవిష్యత్ తరాల అవసరాల కోసం వినియోగించాల్సిన ఖాళీ స్థలాలను సొసైటీ నిర్వాహకులు ఇష్టానుసారంగా లీజుల పేరుతో ఇతరులకు అప్పగించడం వల్ల కాలనీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని విమర్శించారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ, సహకార శాఖలతో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులు సమగ్ర విచారణ జరిపి, కాలనీ భూముల అసలు స్థితిగతులు, లీజుల వివరాలు, ఆర్థిక లావాదేవీలు, భూముల వినియోగంపై పూర్తి సమాచారాన్ని కాలనీవాసులకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా, విచారణ పూర్తయ్యే వరకు సొసైటీ ఎన్నికలను నిర్వహించవద్దని, భూముల వ్యవహారంలో పూర్తి పారదర్శకత తీసుకొచ్చిన అనంతరం మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని గుండాల ముఖేష్ రెడ్డి కోరారు.
రిలే నిరాహార దీక్షకు కాలనీ సభ్యులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై సంఘీభావం తెలిపారు.

