-
త్రాగునీరు, సీజనల్ వ్యాధులు, పాఠశాలల ఎన్రోల్మెంట్పై సీఎస్ ఆదేశాలు…
-
కామారెడ్డి, జూలై 17 (నవజ్యోతి ప్రతినిధి):
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎల్ నినో పరిస్థితులు, త్రాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నియంత్రణ, విద్య, ప్రజాపాలన-ప్రగతి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించారు.
ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల మార్పిడి చేపట్టేలా అవగాహన కల్పించాలని, త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ప్రజాపాలన-ప్రగతి కింద వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు.
జిల్లా ఐడీఓసీ నుంచి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
వరికి బదులుగా తక్కువ నీటితో సాగు చేసే పంటలు, కూరగాయలు, ఉద్యాన పంటలపై రైతులకు రైతు వేదికల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీల పరిసరాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టి దోమల వ్యాప్తిని నివారించాలని తెలిపారు.
వర్షాభావ పరిస్థితుల్లో త్రాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన-ప్రగతి దరఖాస్తులను గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల వారీగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

