మాడుగులపల్లి, జూలై 2 (నవజ్యోతి ప్రతినిధి) మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గడ్డం వేణుగోపాల్ రెడ్డి నియామకంపై మండలంలోని కొందరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండల పార్టీకి నాయకత్వం వహించే వ్యక్తి కార్యకర్తలకు, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, ప్రస్తుతం నియమితులైన గడ్డం వేణుగోపాల్ రెడ్డి ఎక్కువగా హైదరాబాద్లో ఉంటారని, ముఖ్య నాయకులు మండలానికి వచ్చిన సందర్భాల్లో మాత్రమే కనిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కార్యకర్తలకు అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు లేదా పార్టీ కార్యక్రమాల నిర్వహణలో మండల అధ్యక్షుడు అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు నాయకులు పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిని మండల అధ్యక్షుడిగా నియమించి ఉంటే పార్టీ బలోపేతానికి మరింత ఉపయోగపడేదని అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధిష్ఠానం పునఃపరిశీలించి, కార్యకర్తల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

