కాంగ్రెస్ పథకాలపై చర్చకు బీఆర్ఎస్, బీజేపీ సిద్ధమా?
సిరిసిల్ల, సిద్దిపేటలోనైనా చర్చకు మేం సిద్ధం —
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నవజ్యోతి ప్రతినిధి): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజా సంక్షేమ పథకాల అమలులో విజయవంతమైందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 70 వేల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు.
తాము అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై సిరిసిల్ల, సిద్దిపేట సహా ఎక్కడైనా ప్రజల సమక్షంలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం అమలును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ప్రతిపక్ష నేతలు తమతో కలిసి బస్సులో ప్రయాణించాలని సవాల్ చేశారు.
తెలంగాణ ఏర్పాటు వెనుక విద్యార్థులు, ప్రజల త్యాగాలు ఉన్నాయని పేర్కొన్న ఆయన, రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. గత ప్రభుత్వ పాలనతో రాష్ట్ర ఖజానాపై భారం పడిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు తమ పాలనపై బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

