వరదలపై కేరళ కీలక నిర్ణయం..!
కృత్రిమ మేధతో ముందస్తు హెచ్చరికలు.. ఐఐటీలతో ‘ఫ్లడ్ రెసిలియెన్స్’ ప్రణాళిక
తిరువనంతపురం, ఆగస్టు 14 (నవజ్యోతి ప్రతినిధి): భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు వంటి ప్రకృతి విపత్తులను శాస్త్రీయంగా ఎదుర్కొనేందుకు కేరళ ప్రభుత్వం ‘కేరళ ఫ్లడ్ రెసిలియెన్స్ ఇనిషియేటివ్’ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వివిధ ఐఐటీలకు చెందిన నిపుణులు ముఖ్యమంత్రి వీడీ సతీశన్ను కలిసి ప్రణాళికను వివరించారు.
ఐఐటీ రూర్కీ, ఐఐటీ పాలక్కాడ్, ఐఐఐటీ కొట్టాయం నిపుణులు అత్యాధునిక సాంకేతికతతో రాష్ట్రవ్యాప్తంగా వరదల ప్రభావాన్ని ముందుగానే గుర్తించే వ్యవస్థకు ప్రతిపాదనలు సమర్పించారు. కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, రిమోట్ సెన్సింగ్, హైడ్రోడైనమిక్ మోడలింగ్, అత్యంత కచ్చితమైన వర్షపాత అంచనాల ఆధారంగా వరద ముప్పు ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు.
తీవ్ర వర్షాలు.. పట్టణ వరదలపై ప్రత్యేక దృష్టి
అత్యధిక వర్షపాతం, పట్టణ ప్రాంతాల్లో వరదలు, నదుల ఉద్ధృతి, కొండచరియలు తదితర విపత్తులను ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధత అవసరమని నిపుణులు తెలిపారు. ఈ విధానాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయగలిగే నమూనాగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
నదులు, సరస్సులు, బ్యాక్వాటర్లలో పేరుకుపోయిన పూడిక, ఇసుకను తొలగించే ముందు పర్యావరణం, సహజ నీటి ప్రవాహంపై దాని ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలని ఐఐటీ నిపుణులు సూచించారు.
నెలలోగా నివేదిక
ప్రాజెక్టు సాంకేతిక సాధ్యాసాధ్యాలు, ఆర్థిక అవసరాలు, అమలు విధానాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నీటివనరుల శాఖ, విపత్తు నిర్వహణ శాఖలు సంయుక్తంగా పరిశీలించి నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

