బిచ్కుంద, ఆగస్టు 14 (నవజ్యోతి ప్రతినిధి):
ఇంట్లో కుమార్తె వివాహం.. ఆగస్టు 23న శుభకార్యం. పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నప్పటికీ ప్రజల వైద్య సేవలకు ప్రాధాన్యమిస్తూ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శుక్రవారం బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఆసుపత్రికి చేరుకున్న ఆయన సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.
సమయానికి రాని సిబ్బందిపై ఆగ్రహం
ఆసుపత్రిలో కొందరు సిబ్బంది సమయానికి విధులకు హాజరుకాకపోవడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హాజరు పట్టికను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలకు సకాలంలో వైద్యం అందాల్సిన సమయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడం సరికాదని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు.
కలెక్టర్కు ఫిర్యాదు
సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అంశాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు ఆసుపత్రిలో సిబ్బంది హాజరు, సమయపాలనపై పర్యవేక్షణ పెంచాలని కోరారు.
పెళ్లి పనుల మధ్యా.. ప్రజా సేవకు ప్రాధాన్యం
ఆగస్టు 23న కుమార్తె వివాహం ఉండటంతో కుటుంబంలో శుభకార్య ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనూ ఎమ్మెల్యే ఆసుపత్రి తనిఖీకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కుటుంబ కార్యక్రమాల మధ్య కూడా నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన వైద్య సేవలపై దృష్టి సారించి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.

