సీఎం నిర్ణయంపై మంత్రి సీతక్క హర్షం.. నియోజకవర్గానికి 50–100 ఎకరాల్లో ఆధునిక ధాన్యం నిల్వ కేంద్రాలు
హైదరాబాద్, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి): మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకున్న నిర్ణయంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ధాన్యం మిల్లింగ్ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించడంతో పాటు, వారి ఆధ్వర్యంలో ఆధునిక ధాన్యం నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నియోజకవర్గానికి 50 నుంచి 100 ఎకరాల భూమిని కేటాయిస్తామని సీఎం ప్రకటించడం అభినందనీయమన్నారు.
మహిళా సంఘాల ద్వారా ఇప్పటికే పలు రంగాల్లో ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పిస్తున్నామని సీతక్క తెలిపారు. తాజాగా ధాన్యం మిల్లింగ్, నిల్వ రంగాల్లోనూ అవకాశం కల్పించడం ద్వారా గ్రామీణ మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి, వ్యాపార అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
మహిళా సంఘాలను కేవలం పొదుపు, రుణాలకే పరిమితం చేయకుండా ఉత్పత్తి, ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ రంగాల్లో భాగస్వాములను చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపారు.
ప్రతి సీజన్లో ఎదురవుతున్న ధాన్యం నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆధునిక సైలో బ్యాగ్లు, గోదాములు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమన్నారు.
మిల్లింగ్ యూనిట్లు, ఆధునిక గోదాములు ఏర్పాటైతే మహిళా సంఘాలకు ఉపాధితో పాటు స్థిరమైన ఆదాయం సమకూరుతుందని సీతక్క అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర మరింత పెరిగి, ఆర్థిక స్వావలంబన సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
మహిళలను అన్ని రంగాల్లో ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని సీతక్క తెలిపారు.

