ఐదుగురు దొంగలు, ముగ్గురు కొనుగోలుదారుల అరెస్ట్.. 44 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
ఆదిలాబాద్, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి): తెలంగాణ, మహారాష్ట్రలో ద్విచక్ర వాహనాలను చోరీ చేసి నంబర్ ప్లేట్లు మార్చి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు దొంగలతో పాటు చోరీ వాహనాలు కొనుగోలు చేసిన ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి 44 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 20 మంది వరకు కొనుగోలుదారుల పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 5న ఇచ్చోడలోని సుభాష్నగర్ కాలనీలో ఇంటి వద్ద ఓ ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. బాధితుడు ఆగస్టు 6న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారంతో నిందితులను గుర్తించారు.
విచారణలో నిందితులు ఇచ్చోడ, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్తో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో బైక్లు చోరీ చేసినట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. చోరీ చేసిన వాహనాల నంబర్ ప్లేట్లను మార్చి ఇతరులకు విక్రయించేవారని పేర్కొన్నారు. వారి సమాచారంతో 44 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ముఠా సభ్యులు మారంపల్లి అనిల్ (21), షేక్ షబ్బీర్ (39), షేక్ ముస్తాషాహిద్ (36), మహ్మద్ జకీర్ (55), మహ్మద్ షఫీ (37)గా పోలీసులు గుర్తించారు.
చోరీ వాహనాలు కొనుగోలు చేసిన కేశవపట్నంకు చెందిన ముజాహిద్, గుండాలకు చెందిన ఇక్బాల్, కేశవపట్నంకు చెందిన కరీంను కూడా అరెస్టు చేశారు.
స్వాధీనం చేసుకున్న 44 ద్విచక్ర వాహనాల అసలు యజమానులను గుర్తించి, ధ్రువీకరణ అనంతరం వాహనాలను అప్పగించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
ముఠా గతంలో నమోదైన ఇతర బైక్ చోరీ కేసుల్లోనూ ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
సాంకేతిక ఆధారాలతో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఛేదించి పెద్ద సంఖ్యలో వాహనాలను స్వాధీనం చేసుకున్న ఇచ్చోడ పోలీసులను ఎస్పీ అభినందించారు. వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో పార్క్ చేసి, తాళాలు సరిగా వేయాలని, సీసీ కెమెరాలున్న పార్కింగ్ ప్రాంతాలను వినియోగించాలని వాహనదారులకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

