మనోహరాబాద్, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి):
మనోహరాబాద్ మండలంలోని కోనాయిపల్లి గ్రామ పంచాయతీ ధర్మరాజ్పల్లిలో ఆదివారం పోచమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ మన్నే కళ్యాణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మహిళలు సంప్రదాయ పద్ధతిలో బోనాలను సిద్ధం చేసి పసుపు, కుంకుమలతో అలంకరించి అమ్మవారికి సమర్పించారు. డప్పుల మేళాలు, మంగళవాయిద్యాల నడుమ బోనాల ఊరేగింపు నిర్వహించారు.
అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి కలగాలని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం, హారతి, అర్చనలు నిర్వహించి అమ్మవారికి బోనాలను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం డప్పుల మేళాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు సందడిగా సాగాయి.
ఈ సందర్భంగా సర్పంచ్ మన్నే కళ్యాణ్ ముదిరాజ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో పోచమ్మ అమ్మవారిని ఆరాధ్య దైవంగా భావిస్తూ బోనాలు సమర్పించడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయమని అన్నారు. ఈ పండుగ భక్తి, కుటుంబ సంక్షేమం, గ్రామీణ జీవన విధానం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, మాజీ టీసీ చైర్మన్ మెట్టు బాలకృష్ణ రెడ్డి, భాషబోయిన చంద్రశేఖర్, యంజాల సుధాకర్ రెడ్డి, స్థానిక పెద్దలు, నాయకులు, మహిళలు, యువత, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

