యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. తల్లిదండ్రులను బాగా చూసుకుంటేనే పిల్లలు మనల్ని చూసుకుంటారు: జగ్గారెడ్డి…
సంగారెడ్డి, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి): సంగారెడ్డి పట్టణంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గత 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా జగ్గారెడ్డి నివాసం నుంచి భవానీ మందిర్ మీదుగా దుర్గమ్మ గుడి వరకు శోభాయాత్ర నిర్వహించారు. పోతరాజుల నృత్యాలు, డప్పు చప్పుళ్లు, కోలాటాలు, కాళికామాత, దుర్గామాత వేషధారణలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జగ్గారెడ్డి మాట్లాడుతూ యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి వ్యసనంతో యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. సిగరెట్లు, చాక్లెట్లు, బర్గర్లలోనూ మత్తు పదార్థాలు కలిపి సరఫరా చేస్తున్నారంటూ తల్లిదండ్రులు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.
చిన్నపిల్లలను సెల్ఫోన్లకు బానిసలుగా మార్చవద్దని తల్లిదండ్రులకు సూచించారు. అవసరానికి మించి ఫోన్ వినియోగించడం వల్ల పిల్లలు, యువతలో జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోందన్నారు. ఫోన్లను అవసరమైన సమాచారం కోసం మాత్రమే వినియోగించాలని సూచించారు.
రాహుల్గాంధీ నాయకత్వంలో సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రులు తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నారని జగ్గారెడ్డి తెలిపారు. యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.
తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను పెంచుతున్నారని జగ్గారెడ్డి అన్నారు. మన తల్లిదండ్రులను బాగా చూసుకుంటేనే భవిష్యత్తులో మన పిల్లలు కూడా మనల్ని బాగా చూసుకుంటారని పేర్కొన్నారు. కుటుంబ విలువలు, బాధ్యతలను చిన్ననాటి నుంచే పిల్లలకు నేర్పించాలని సూచించారు.

