ఆహార కల్తీ చేస్తే సభ్యత్వానికే గుడ్బై.. కఠిన నిర్ణయం..
హైదరాబాద్, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి): ఆహార పదార్థాల్లో కల్తీకి పాల్పడే వ్యాపారులపై హైదరాబాద్ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ (THKMA) కఠిన వైఖరి అవలంబించింది. కల్తీ, నకిలీ బ్రాండింగ్, కృత్రిమ రంగులు, అక్రమ వ్యాపార పద్ధతుల్లో పాల్గొన్నట్లు అధికారికంగా తేలిన సభ్యుల సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేస్తామని సంఘం స్పష్టం చేసింది.
తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ శాఖ తనిఖీలు ముమ్మరం చేసిన నేపథ్యంలో అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించిన సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. చట్టాన్ని ఉల్లంఘించే వ్యాపారులకు ఎలాంటి మద్దతు ఉండదని, నిజాయితీగా వ్యాపారం చేసే వారి ప్రతిష్ఠను కాపాడటమే తమ లక్ష్యమని సంఘం అధ్యక్షుడు దామోదర్ దాస్ విజయవర్గీయ, కార్యదర్శి అవినాష్ దేవ్డా తెలిపారు.
వ్యాపారులు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం (FSSAI) నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యమైన ఉత్పత్తులనే విక్రయించాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు, తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం, హెచ్-ఫాస్ట్ బృందాలు నిర్వహిస్తున్న తనిఖులకు పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
ఇటీవల హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో పప్పుధాన్యాలకు కృత్రిమ రంగులు వేయడం, పాత ధాన్యాలను రసాయనాలతో మెరిపించడం, గడువు ముగిసిన ఉత్పత్తుల విక్రయం, అపరిశుభ్ర నిల్వలు వంటి ఉల్లంఘనలు వెలుగులోకి రావడంతో కిరాణా సంఘం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజాయితీగా వ్యాపారం చేసే వ్యాపారుల విశ్వసనీయతను కాపాడేందుకు ఈ చర్యలు దోహదపడతాయని సంఘం అభిప్రాయపడింది.

