ఎరువుల పంపిణీలో నూతన అధ్యాయం
డిజిటల్ విధానంలోకి ఎరువుల విక్రయాలు
బ్లాక్ మార్కెట్కు చెక్.. FFSతో రియల్టైమ్ పర్యవేక్షణ.
రైతులకు పారదర్శకంగా ఎరువుల పంపిణీ.
రామాయంపేట, ఆగస్టు 5 ( నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) :
కేంద్ర ప్రభుత్వం ఎరువుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేసే దిశగా Framework for Fertilizer Sale (FFS) విధానాన్ని ఆగస్టు 6 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఇకపై యూరియా, డీఏపీ (DAP), ఎంఓపీ (MOP), ఎన్పీకే (NPK) కాంప్లెక్స్తో పాటు అన్ని సబ్సిడీ ఎరువుల విక్రయాలు FFS యాప్ ద్వారానే నిర్వహించబడతాయి.రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో, పారదర్శకంగా అందించడంతో పాటు ఎరువుల నిల్వలు, విక్రయాలు, సబ్సిడీ ప్రక్రియలను రియల్టైమ్ లో పర్యవేక్షించడం, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టడం ఈ విధానం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.రైతులు తమ మొబైల్ నంబర్తో FFS యాప్ లో నమోదు చేసుకుని, పంట వివరాలు, సాగు విస్తీర్ణం, అవసరమైన ఎరువులను నమోదు చేసిన అనంతరం సమీప డీలర్ ను ఎంపిక చేసుకోవాలి. యాప్ రూపొందించే ప్రత్యేక QR కోడ్ డీలర్ కు చూపించగా, స్కాన్ చేసిన తర్వాత రైతు వివరాలు ధృవీకరించి ఎరువులు అందజేస్తారు. విక్రయ వివరాలు వెంటనే కేంద్ర సర్వర్ లో నమోదు అవుతాయి.
ఈ విధానంతో ఎరువుల కోసం వేచి ఉండే సమయం తగ్గడంతో పాటు, సరైన రైతుకు సబ్సిడీ ఎరువులు చేరేలా పారదర్శక వ్యవస్థ ఏర్పడుతుందని వ్యవసాయ శాఖ పేర్కొంది.ప్రస్తుతం అమలులో ఉన్న పాత ఎరువుల విక్రయ యాప్ ద్వారా ఆగస్టు 5 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విక్రయాలు జరుగుతాయని, ఆ తర్వాత పూర్తిగా FFS విధానమే అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. రైతులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO)లను సంప్రదించి FFS లో నమోదు చేసుకుని నూతన విధానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మండలంలోని అన్ని ఎరువుల విక్రయ కేంద్రాల్లో FFS అమలుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.

