గద్దర్ ఆశయాల సాధనకు ముందుకు రావాలి.
గద్దర్ పాటలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచాయి.
ఈ నెల 6 హైదరాబాద్ సభను విజయవంతం చేయాలని పిలుపు
రామాయంపేట,ఆగస్టు 5 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్) :
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ ఉద్యమకారుల క్యాంప్ కార్యాలయంలో ప్రజాయుద్ధనౌక గద్దర్ 3వ వర్ధంతి సభ పోస్టర్లను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు గుండా (దాస్) ఎల్లం ఆధ్వర్యంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాకవి గద్దర్ తన ఆరు దశాబ్దాల జీవితాన్ని పీడిత ప్రజల హక్కులు, సామాజిక న్యాయం, తెలంగాణ ఆకాంక్షలు మరియు ప్రజా ఉద్యమాల కోసం అంకితం చేశారని పేర్కొన్నారు.భౌతికంగా గద్దర్ దూరమైనా ఆయన ఆశయాలు, ప్రజా చైతన్యాన్ని రగిలించిన పాటలు, సమానత్వ సందేశం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని అన్నారు. గద్దర్ చేసిన పోరాట స్ఫూర్తిని భావితరాలకు చేర్చేందుకు గద్దర్ ఫౌండేషన్ కృషి చేస్తోందని తెలిపారు.
గద్దర్ కుమారుడు సూర్యం ఆధ్వర్యంలో ఆగస్టు 6న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే 3వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని, ప్రజలు, ఉద్యమకారులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు గంగా రాములు, మాజీ ఎంపీటీసీ మైలారం బిక్షపతి, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మాసాయిపేట మల్లేశం, డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాసి సంజీవ్, టీఆర్ఎస్ నిజాంపేట అధ్యక్షుడు నాగరాజు, నగేష్ యాదవ్,మోహన్ రెడ్డి, కోనేరు శ్రీనివాస్, మాల మహానాడు మండల అధ్యక్షుడు బైరం సిద్ధరాములు, నక్క శ్రీనివాస్, పుట్టి సిద్ధరాములు, నందిగామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

