ప్రయాణికుల అరుపులతో దద్దరిల్లిన క్యాబిన్.. 14 మందికి గాయాలు
థాయ్లాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI2379 విమానం గాల్లో తీవ్ర టర్బులెన్స్కు గురై ఒక్కసారిగా సుమారు 300 అడుగుల మేర ఎత్తు కోల్పోవడంతో విమానంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు, నలుగురు క్యాబిన్ సిబ్బంది గాయపడగా, విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
సుమారు 134 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం అకస్మాత్తుగా భారీ కుదుపులకు గురికావడంతో సీటు బెల్ట్ ధరించని పలువురు ప్రయాణికులు గాల్లోకి ఎగిరి క్యాబిన్ పైభాగాన్ని ఢీకొని మళ్లీ సీట్లపై పడిపోయారు. క్యాబిన్లో సామాన్లు చెల్లాచెదురవగా, పలువురికి తల, భుజాలు, చేతులకు గాయాలయ్యాయి.
భయానక అనుభవం
ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ, “విమానం ఒక్కసారిగా కిందికి దూసుకెళ్లింది. నా చేతిలో ఉన్న చిన్నారి మూడు సీట్ల దూరంలో పడిపోయింది. ఆ క్షణంలో బతికి బయటపడతామనే ఆశే లేకపోయింది. ఇది మాకు పునర్జన్మ లాంటిది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆస్పత్రులకు తరలింపు
గాయపడిన వారిని విమానం ఢిల్లీలో దిగిన వెంటనే వైద్య బృందాలు పరీక్షించాయి. తీవ్ర గాయాలైన కొందరిని గురుగ్రామ్లోని మెదాంతా ఆస్పత్రి, ఢిల్లీలోని ఇండియా స్పైనల్ ఇంజురీ సెంటర్, ఫోర్టిస్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
విచారణ ప్రారంభం
టర్బులెన్స్ కారణంగా విమానం తాత్కాలికంగా ఎత్తులో మార్పుకు గురైనప్పటికీ సురక్షితంగా ఢిల్లీకి చేరిందని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారు.

