పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రాష్ట్రంలో 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. నియామక ప్రక్రియకు భంగం కలిగించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, ఇతర స్వార్థపూరిత శక్తులు ప్రయత్నించే అవకాశముందని నిఘా వర్గాలు నివేదించడంతో సీఎం అత్యవసర సమీక్ష నిర్వహించారు.
డీజీపీ సీవీ ఆనంద్తో పాటు పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి, నియమ నిబంధనలకు అనుగుణంగా ఎలాంటి లోపాలకు తావులేకుండా పరీక్షల నిర్వహణ చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణా నుంచి పరీక్షల నిర్వహణ వరకు ప్రతి దశలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
పరీక్ష కేంద్రాల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే దళారులు, నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ క్రైమ్ విభాగం కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
దుష్ప్రచారంపై కఠిన చర్యలు
పరీక్షలకు సంబంధించిన తప్పుడు ప్రచారం, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, పరీక్షల ప్రక్రియ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
సమావేశంలో సీఎం ప్రధాన కార్యదర్శి వి. శేషాద్రి, డీజీపీ సీవీ ఆనంద్, హోంశాఖ ప్రధాన కార్యదర్శి శిఖా గోయల్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.

