గుప్తనిధుల పేరుతో తవ్వకాలు.. నగదు, బంగారం…
వినియోగించుకున్నాడని ఆరోపణలు.. కేసు నమోదు !
తూప్రాన్, ఆగస్టు 3 (నవజ్యోతి ప్రతినిధి నవీన్):
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో బాబాగా పరిచయం చేసుకుని ఓ కుటుంబాన్ని నమ్మించి, అదే కుటుంబంలోని యువతిని వివాహం చేసుకున్న వ్యక్తి వ్యవహారం స్థానికంగా సంచలనంగా మారింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాబానని నమ్మించి కుటుంబానికి చేరువ
గ్రామస్తుల కథనం ప్రకారం, సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం చౌదర్పల్లికి చెందిన నాజర్ మస్తాన్ అలియాస్ హేమంత్ అనే వ్యక్తి బంధువుల ద్వారా గుండ్రెడ్డిపల్లి గ్రామంలోని ఓ కుటుంబానికి పరిచయమయ్యాడు. తాను బాబానని, మంత్రశక్తులు ఉన్నాయని చెబుతూ కుటుంబ సభ్యుల విశ్వాసాన్ని సంపాదించాడు. కుటుంబ పెద్ద మరణించిన తర్వాత వారి ఇంట్లోనే ఉంటూ మరింత సన్నిహితంగా మెలిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
యువతితో వివాహం.. పాత పెళ్లిళ్లపై ఆరోపణలు
రెండు నెలల క్రితం అదే కుటుంబంలోని రెండో కుమార్తెను వివాహం చేసుకున్నట్లు సమాచారం. అయితే అప్పటికే అతనికి మరో రెండు వివాహాలు జరిగాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
గుప్తనిధుల పేరుతో మోసం చేశారన్న ఆరోపణ
ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని, ప్రత్యేక పూజలు, మంత్రాలతో వాటిని వెలికితీస్తానని చెప్పి బాధిత కుటుంబ ఇంట్లో తవ్వకాలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కుటుంబానికి చెందిన నగదు, బంగారం కూడా తన అవసరాలకు వినియోగించుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
గ్రామస్తుల ఆగ్రహం.. పోలీసు కేసు
ఆదివారం గ్రామానికి తిరిగి వచ్చిన హేమంత్ను గ్రామస్తులు అడ్డుకుని ప్రశ్నించినట్లు సమాచారం. సరైన సమాధానం ఇవ్వకపోవడంతో కొందరు అతడిపై దాడి చేసినట్లు తెలిసింది. అనంతరం అతడి మొబైల్ ఫోన్ను పరిశీలించగా పలువురు మహిళలు, యువతుల ఫొటోలు ఉన్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు తూప్రాన్ పోలీసులు నాజర్ మస్తాన్ అలియాస్ హేమంత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

