100 శాతం ఎస్ఐఆర్ పూర్తి చేసిన బీఎల్వోలకు సన్మానం.. స్వయం ఉపాధికి రూ.5 లక్షల వరకు రుణాలపై వివరాలు
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు గ్రామ పారిశుధ్యం, చెత్త వర్గీకరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందజేయాలి
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తడి, పొడి చెత్తను ఇంటి వద్దే వేర్వేరుగా సేకరించి మున్సిపల్ లేదా గ్రామపంచాయతీ సిబ్బందికి అందించడం ద్వారా గ్రామ పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. ప్రతి కుటుంబం చెత్త నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
మహిళా సంఘాలకు రూ.5 లక్షల వరకు రుణాలు
మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న రుణ సదుపాయాలపై కూడా అవగాహన కల్పించారు. క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ సంఘ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే సంఘాలకు అర్హత ఆధారంగా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ రుణాలను స్వయం ఉపాధి, సూక్ష్మ వ్యాపారాలు, పాడి పరిశ్రమ తదితర జీవనోపాధి కార్యక్రమాలకు వినియోగించుకోవాలని సూచించారు.
ఎస్ఐఆర్ పూర్తి చేసిన బీఎల్వోలకు సన్మానం
గ్రామంలో ప్రత్యేక ఓటరు సర్వే (ఎస్ఐఆర్) ప్రక్రియను వంద శాతం పూర్తి చేసిన బీఎల్వోలను గ్రామ సర్పంచ్ కొత్త స్రవంతి ఘనంగా సన్మానించారు. పోలింగ్ స్టేషన్లు 64, 65 పరిధిలోని 1,802 మంది ఓటర్ల ఎస్ఐఆర్, డిజిటలైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన బీఎల్వోలు బాలమణి, మైలారం బుజ్జిని శాలువాలతో సత్కరించి అభినందించారు. వారికి సహకరించిన బీఎల్ఏలను కూడా ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్, ఉపసర్పంచ్ బాబు, గ్రామ కార్యదర్శి ధనలక్ష్మి, వెలుగు సీఏలు రాజు, శ్యామల, ఫీల్డ్ అసిస్టెంట్ గొల్ల శ్రీశైలం, అంగన్వాడీ టీచర్ బాలమణి, ఆశా వర్కర్లు కొప్పుల సరళ, కొప్పుల చంద్రకాలమ్మ, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

