– ఆంజనేయ స్వామికి చందనోత్సవం.. అన్నప్రసాద వితరణసం
సంగారెడ్డి, జూలై 14 (నవజ్యోతి ప్రతినిధి):
శ్రీ సాహితీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మీనా రాము ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 108 అమావాస్యల ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగంగా మంగళవారం పోతిరెడ్డిపల్లి శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కేతకి సంగమేశ్వర స్వామికి వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా, ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామికి చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమానికి హాజరైన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆశీర్వాదాలు పొందారు. అలాగే అన్నప్రసాద మహాయజ్ఞంలో భాగంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ సేవ నిర్వహించారు. ఈ సేవలో పలువురు భక్తులు, సేవాభావంతో స్వచ్ఛందంగా పాల్గొని సహకారం అందించారు. ప్రతి అమావాస్య రోజున నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు భక్తుల్లో భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో సేవా దృక్పథాన్ని చాటుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

