- ఎస్సీ కోటాలో నిబంధనలకు విరుద్ధంగా నియామకం జరిగిందని స్థానికుల ఆరోపణ
కొండాపూర్, జూలై 07 (నవజ్యోతి ప్రతినిధి) :
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి గ్రామంలోని అంగన్వాడీ–1 టీచర్ నియామకంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్సీ కోటాకు కేటాయించిన పోస్టులో నిబంధనలకు విరుద్ధంగా బీసీ అభ్యర్థిని ఎంపిక చేశారని వారు ఆరోపించారు. నోటిఫికేషన్ విడుదలకు ముందే నియామక ప్రక్రియ పూర్తయిందని, దీంతో పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ అమలులో ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం విచారకరమని అన్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు స్థానికులు తెలిపారు. జూలై 17లోపు సంబంధిత అధికారులు విచారణ జరిపి, ఆరోపణల్లో నిజానిజాలు తేల్చాలని, ఏవైనా అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు అర్హులైన ఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే, ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల స్పందన ఇంకా తెలియాల్సి ఉంది.

