డప్పు సప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో సందడి
పటాన్చెరు(ఉస్మాన్ నగర్), ఆగష్టు 16(నవజ్యోతి ప్రతినిధి):
పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మాన్ నగర్లో సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు పర్శ శ్యామ్ రావ్ ఆధ్వర్యంలో గాలి పోచమ్మ అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు.డప్పు సప్పుళ్లు,పోతురాజుల విన్యాసాలు,దేవతామూర్తుల వేషధారణలో కళాకారుల ఆటపాటలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
70 ఏళ్లుగా గ్రామస్థుల ఇలవేల్పుగా
ఈ సందర్భంగా పర్శ శ్యామ్ రావ్ మాట్లాడుతూ, సుమారు 70 సంవత్సరాల క్రితం గ్రామ పెద్దలు ఒక చెట్టు కింద గాలి పోచమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించారని, ఉస్మాన్ నగర్ గ్రామస్థుల ఇలవేల్పుగా, భక్తుల కొంగుబంగారంగా అమ్మవారు ప్రసిద్ధి చెందారని,కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్తుల విశ్వాసాన్ని పొందారని పేర్కొన్నారు.
అన్నదాన కార్యక్రమం ఏర్పాటు
గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని,తాను ఉన్నంత కాలం మరింత వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఉత్సవాలకు హాజరైన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామస్తులు,భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం ఈ వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.
అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కల్పన రామ్ మోహన్ రెడ్డి, కల్పన శ్రీనివాస్, రామేశ్వర్ రావు, మాజీ ఉపసర్పంచ్ కావాలి రాములు, మాజీ వార్డు సభ్యులు పెంటయ్యా, శ్రీలత విష్ణు, కమలమ్మ, బాలరాజు, కుమార్, రవీందర్ రెడ్డి, వినోద్, రాములు, సత్తి రెడ్డి, నర్సింగ్ రావు, నరసింహ, శేఖర్ , మల్లేష్, అశోక్,స్థానిక నాయకులు, యువకులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

