హైదరాబాద్, కడపలో 7 ప్రాంతాల్లో తనిఖీలు.. అవినాష్రెడ్డి నివాసంలో కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, లాకర్ తాళాలు స్వాధీనం.. రూ.40 కోట్ల హత్య డీల్ ఆరోపణలపై మనీలాండరింగ్ దర్యాప్తు
హైదరాబాద్, ఆగస్టు 21 (నవజ్యోతి ప్రతినిధి):
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది.
2019లో జరిగిన ఈ హత్యకు సంబంధించి నమోదైన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)
అధికారులు శుక్రవారం హైదరాబాద్, కడపలోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సంబంధించిన నివాసంలో రూ.24 లక్షల లెక్కల్లో చూపని నగదు
తో పాటు రెండు లాకర్ తాళాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది.
సోదాల్లో కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
హత్య కుట్రకు సంబంధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక లావాదేవీల మార్గాన్ని గుర్తించడమే
దర్యాప్తు లక్ష్యమని పేర్కొంది.
అసలు కేసు ఏంటి?
2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి తన నివాసంలో హత్యకు గురయ్యారు.
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది.
హత్య, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేసిన సీబీఐ.. దర్యాప్తు అనంతరం పలు ఛార్జిషీట్లు దాఖలు చేసింది.
వైఎస్ అవినాష్రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డి,
డి. శివశంకర్రెడ్డి, టి. గంగిరెడ్డి, వై. సునీల్ యాదవ్ తదితరుల పేర్లు
సీబీఐ దర్యాప్తులో నిందితులుగా ప్రస్తావించబడ్డాయి.
రూ.40 కోట్ల హత్య డీల్ ఆరోపణ
సీబీఐ దర్యాప్తులో అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా
హత్యకు ముందే కుట్ర జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. వివేకానందరెడ్డి హత్య కోసం
రూ.40 కోట్ల డీల్ కుదిరిందని, తనకు రూ.5 కోట్లు ఇస్తామని చెప్పినట్లు
దస్తగిరి వెల్లడించినట్లు ఈడీ తెలిపింది.
ఛార్జిషీట్లలోని ఆరోపణల ఆధారంగా ఉన్నాయి. ఇవి న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న అంశాలు.
రూ.కోటి చెల్లింపు.. రూ.46.70 లక్షల నగదు రికవరీ
దస్తగిరికి రూ.1 కోటి అందినట్లు కూడా సీబీఐ దర్యాప్తులో పేర్కొన్నట్లు ఈడీ తెలిపింది.
అందులో రూ.25 లక్షలు సునీల్ యాదవ్ తీసుకున్నారని, మిగిలిన రూ.75 లక్షలు
దస్తగిరి స్నేహితుడు సయ్యద్ మున్నాకు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తదుపరి దర్యాప్తులో మున్నా, ఆయన తల్లికి సంబంధించిన లాకర్ నుంచి
రూ.46.70 లక్షల నగదు, లెక్కల్లో చూపని బంగారు ఆభరణాలు
స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది.
మనీలాండరింగ్ కేసు ఎందుకు?
సీబీఐ నమోదు చేసిన కేసు, దాఖలు చేసిన ఛార్జిషీట్ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
హత్య, నేరపూరిత కుట్రకు సంబంధించిన నేరాలు పీఎంఎల్ఏ పరిధిలోని షెడ్యూల్డ్ నేరాలుగా ఉన్నందున..
వాటి ద్వారా వచ్చినట్లు ఆరోపణలు ఉన్న డబ్బు, ఆస్తుల ఆర్థిక మార్గాన్ని ఈడీ పరిశీలిస్తోంది.
తాజా సోదాల్లో లభించిన రూ.24 లక్షల నగదు, పత్రాలు, డిజిటల్ పరికరాలు,
లాకర్ తాళాలు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది.
స్వాధీనం చేసుకున్న సమాచారాన్ని పరిశీలించి తదుపరి ఆర్థిక లావాదేవీలను ఈడీ అధికారులు ట్రాక్ చేయనున్నారు.
దర్యాప్తు కొనసాగుతోంది
వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణల వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు,
నగదు ప్రవాహంపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. తాజా సోదాల్లో స్వాధీనం చేసుకున్న
పత్రాలు, డిజిటల్ పరికరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

