14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. బీఎన్ఎస్ 105, జేజే యాక్ట్ 75 సెక్షన్లు
విశాఖపట్నం, ఆగస్టు 26 (నవజ్యోతి ప్రతినిధి): లిటిల్ గార్డెన్ స్కూల్లో ఆరేళ్ల యూకేజీ విద్యార్థి తమ్మన ప్రణయ్ తేజ మృతి కేసులో టీచర్ దొన్ను కుముసను వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
కేసులో కీలక సెక్షన్లు
పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా బీఎన్ఎస్ సెక్షన్ 194 కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం బీఎన్ఎస్ సెక్షన్ 105తో పాటు పిల్లలపై దాడి, వేధింపులకు సంబంధించిన జువైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75ను చేర్చారు.
హోంవర్క్ విషయంలో మందలింపు
ఆగస్టు 20న లిటిల్ గార్డెన్ స్కూల్లో ప్రణయ్ తేజ తరగతి గదిలో కుప్పకూలి మృతి చెందాడు. హోంవర్క్ పూర్తి చేయలేదనే కారణంతో టీచర్ అతడిని మందలించి, చెంపదెబ్బ కొట్టినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే తొలుత నమోదైన ఎఫ్ఐఆర్లో చెంపదెబ్బ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.
విద్యాశాఖ విచారణ కమిటీ
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. రీజినల్ జాయింట్ డైరెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి కమిటీలో ఉన్నారు. ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.
వైద్య నివేదికలపైనే తదుపరి చర్యలు
విద్యార్థి మృతికి సంబంధించిన పూర్తి కారణాన్ని నిర్ధారించేందుకు పోస్టుమార్టం, ఇతర వైద్య నివేదికలు కీలకంగా మారనున్నాయి. పోలీసుల దర్యాప్తు, వైద్య నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి. టీచర్ అరెస్ట్తో పాటు స్కూల్ యాజమాన్యం పాత్రపైనా విద్యాశాఖ విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

