16 లీటర్ల స్ప్రేయింగ్.. 12 లీటర్ల స్ప్రెడింగ్ సామర్థ్యంతో ‘నికా-2’
హైదరాబాద్, ఆగస్టు 15 (నవజ్యోతి ప్రతినిధి): వ్యవసాయ రంగంలో డ్రోన్ సాంకేతికత వినియోగాన్ని మరింత విస్తరించే దిశగా హైదరాబాద్కు చెందిన మహిళా నేతృత్వంలోని అకిన్ అనలిటిక్స్ సంస్థ ‘నికా-2 కిసాన్ మీడియం డ్రోన్’ను ఆవిష్కరించింది. న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ డ్రోన్ను ఆవిష్కరించి దాని పనితీరును పరిశీలించారు.
నికా-2 ద్వారా పంటలకు పురుగుమందులు, ఇతర ద్రావణాలను పిచికారీ చేయడంతో పాటు విత్తనాలు, ఎరువులు తదితరాలను విస్తరించేలా రూపొందించారు. ఇందులో 16 లీటర్ల వరకు స్ప్రేయింగ్, 12 లీటర్ల వరకు స్ప్రెడింగ్ సామర్థ్యం ఉంది. అవసరాన్ని బట్టి రెండు విధాల పనులకు ఒకే డ్రోన్ను ఉపయోగించుకునేలా ప్రత్యేక పేలోడ్ మార్పిడి వ్యవస్థను ఏర్పాటు చేశారు.
కొండ ప్రాంతాల్లోనూ ఉపయోగం
డ్రోన్లో భూమి ఆకృతికి అనుగుణంగా ఎత్తును సర్దుబాటు చేసుకునే టెర్రెయిన్ ఫాలోయింగ్ టెక్నాలజీ, వైఫల్య పరిస్థితుల్లో భద్రత కల్పించే ఫెయిల్సేఫ్ వ్యవస్థ, రాత్రి వేళల్లో కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం ఉన్నాయి. దీంతో తోటలు, వాలు ప్రాంతాలు, అసమతల భూముల్లోనూ పంటలపై సమర్థంగా పిచికారీ చేసే అవకాశం ఉంటుంది.
వ్యవసాయంతో పాటు చేపల పెంపకంలో మేత పంపిణీ, తోటలు, గనులు, ఇంధన, మౌలిక వసతులు, రక్షణ రంగాల్లోనూ డ్రోన్ సాంకేతికతను వినియోగించే అవకాశాలను సంస్థ పరిశీలిస్తోంది.
డ్రోన్తోపాటు డేటాపైనా దృష్టి
అకిన్ అనలిటిక్స్ కేవలం డ్రోన్ల తయారీకే పరిమితం కాకుండా.. డ్రోన్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించే కృత్రిమ మేధ ఆధారిత ప్లాట్ఫామ్లు, డిజిటల్ ట్విన్ సాంకేతికతలపై కూడా పనిచేస్తోంది. వ్యవసాయ భూములు, పారిశ్రామిక ఆస్తులు, మౌలిక వసతులను పరిశీలించి అవసరమైన సమాచారాన్ని అందించడం ద్వారా నిర్ణయాలు తీసుకోవడంలో ఈ సాంకేతికత ఉపయోగపడనుంది.
స్టార్టప్కు నిధి ప్రయాస్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్, మైతీ సమృద్ధ్ వంటి కార్యక్రమాల నుంచి మద్దతు లభించింది. రక్షణ రంగ ఆవిష్కరణల కోసం ఐడెక్స్ వ్యవస్థలోనూ సంస్థ భాగస్వామ్యమైంది.
రైతుల సమస్యలకు సాంకేతిక పరిష్కారమే లక్ష్యం
సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈఓ జానకి పులపర్తి మాట్లాడుతూ.. భారతదేశంలోనే అభివృద్ధి చేసిన సాంకేతికతతో రైతుల వాస్తవ సమస్యలకు పరిష్కారాలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. వ్యవసాయంతో ప్రారంభమైన డ్రోన్ సాంకేతికతను భవిష్యత్తులో పలు రంగాలకు విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

