కామారెడ్డి, జూలై 1 (నవజ్యోతి ప్రతినిధి):
కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో సీనియర్ సిటిజన్స్ ఫోరం సమీపంలో రూ.93 కోట్ల తాగునీటి పథకం కింద నిర్మించనున్న తొమ్మిదో ఎత్తైన నీటి నిల్వ ట్యాంక్ నిర్మాణ పనులకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర తాగునీటి పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకం కింద మొత్తం తొమ్మిది ఎత్తైన నీటి నిల్వ ట్యాంకులను నిర్మించనున్నట్లు, ఇప్పటికే ఎనిమిది ట్యాంకుల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.
విద్యానగర్లో ట్యాంక్ నిర్మాణానికి స్థల సమస్య నెలకొన్నప్పటికీ, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సంఘం స్థలాన్ని కేటాయించడంతో పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రజా ప్రయోజనం కోసం స్థలాన్ని అందించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
తొమ్మిదో ట్యాంక్ పూర్తయితే పట్టణంలో తాగునీటి సరఫరా మరింత మెరుగై సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. అలాగే పట్టణంలో దాదాపు 100 కిలోమీటర్ల మేర చేపట్టిన కొత్త తాగునీటి పైప్లైన్ పనులు కూడా త్వరలో పూర్తవుతాయని, ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీటిని అందించే లక్ష్యాన్ని ప్రభుత్వం సాధిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో కామారెడ్డి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమా శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేని సందీప్, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, ఇంజినీరింగ్ శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

