మహంకాళి, పోచమ్మ అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ
మనోహరాబాద్, ఆగస్టు 2 (నవజ్యోతి ప్రతినిధి నవీన్):
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ దేవతలైన మహంకాళి, పోచమ్మ అమ్మవార్లకు ఆదివారం భక్తిశ్రద్ధలతో బోనాల జాతర నిర్వహించారు. గ్రామస్థులు కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవార్లకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శివసత్తులు, పోతురాజుల విన్యాసాల మధ్య మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన భక్తులు, అనంతరం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కందల రాజనర్సింహ, ఉపసర్పంచ్ రామ్రెడ్డి, మాజీ సర్పంచులు సంజీవ్రెడ్డి, నరాల పెంటయ్య, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

