నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. స్టాక్ సీజ్కు హెచ్చరిక…
మిర్యాలగూడ, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి): డీఏపీ ఎరువులను ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో మిర్యాలగూడ వ్యవసాయ డివిజన్ పరిధిలో వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన పలువురు ఎరువుల డీలర్లకు మెమోలు జారీ చేశారు.
వ్యవసాయ సహాయ సంచాలకులు కొండేటి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు–1985 ప్రకారం ఎమ్మార్పీ కంటే అధిక ధరకు ఎరువులు విక్రయించరాదని స్పష్టం చేశారు. స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించడంతో పాటు రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని డీలర్లను ఆదేశించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దుతో పాటు స్టాక్ స్వాధీనం చేసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డివిజన్ పరిధిలో డీఏపీ ఎరువులకు ఎలాంటి కొరత లేదని, రైతులు అధికారిక లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దనే ఎరువులు కొనుగోలు చేసి తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు.
ఎమ్మార్పీ కంటే అధిక ధర వసూలు చేసినట్లయితే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని, 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని వ్యవసాయ సహాయ సంచాలకులు తెలిపారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో బిల్లు తప్పనిసరిగా తీసుకుని భద్రపరచుకోవాలని సూచించారు.

