ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన పశువుల పాకలకు చెక్కుల పంపిణీ.. సర్పంచ్ పుట్ట వినోదం మహేందర్
మనోహరాబాద్, ఆగస్టు 2 (నవజ్యోతి ప్రతినిధి నవీన్):
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మనోహరాబాద్ మండలం పోతారం గ్రామ సర్పంచ్ పుట్ట వినోదం మహేందర్ అన్నారు. గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద నిర్మించిన పశువుల పాకలకు సంబంధించిన చెక్కులను ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు.
గ్రామానికి చెందిన రైతులు పులి ఇలేష్ యాదవ్, పులి మల్లేష్ యాదవ్లకు మొత్తం రూ.1.20 లక్షల విలువైన చెక్కులను సర్పంచ్ పంపిణీ చేశారు. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకుని వ్యవసాయంతో పాటు పశుసంవర్ధక రంగాన్ని కూడా బలోపేతం చేసుకోవాలని ఆయన సూచించారు.

