నారాయణఖేడ్, జూలై 27 (నవజ్యోతి ప్రతినిధి):
ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం విజయవంతం కావడంలో బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏలు) పాత్ర అత్యంత కీలకమని టీజీఐఐసీ చైర్పర్సన్, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పేర్కొన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి ఆగస్టు 3 వరకు మాత్రమే గడువు ఉన్నందున అర్హులైన ప్రతి ఓటరికి నమోదు ఫారాలు అందేలా బీఎల్ఏలు కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లోని ప్రతి బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకొని, ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహకరించి, పూర్తి చేసిన దరఖాస్తులను బీఎల్వోలకు అందజేయాలని సూచించారు.
ఇంకా నమోదు చేయని అర్హులైన ఓటర్లను గుర్తించి, వారికి అవసరమైన అవగాహన కల్పించి నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్థానికంగా లేని ఓటర్ల వివరాలు సేకరించి, వారు కూడా గడువులోపు ఫారాలు సమర్పించేలా సమన్వయం చేయాలని కోరారు. సమయం తక్కువగా ఉన్నందున బీఎల్ఏలు, పార్టీ నాయకులు సమిష్టిగా పనిచేసి బూత్ల వారీగా వంద శాతం నమోదు లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బూత్ల వారీ కార్యాచరణ, నమోదు పురోగతి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ధర్మ శంకర్, కౌన్సిలర్లు లక్ష్మణ్, సురేష్, సేవాలాల్ సంఘం రాష్ట్ర నాయకులు రమేష్ చౌహాన్, పీఏసీఎస్ చైర్మన్ శోభా అశోక్ రెడ్డి, మైనార్టీ నాయకుడు తాహెర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు జ్ఞానరెడ్డి, శ్రీనివాసరావు, లింగారెడ్డి, సర్దార్, యాదవరెడ్డి, సర్పంచులు, ఉపసర్పంచులు, పార్టీ నాయకులు, బీఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు.

