- సీపీఐ దామరచర్ల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్
దామరచర్ల, జూలై 26 (నవజ్యోతి ప్రతినిధి) నీట్ పేపర్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని సీపీఐ దామరచర్ల మండల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్ ఘటనపై సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాలకు సీపీఐతో పాటు విద్యార్థి, యువజన సంఘాలు మద్దతు తెలిపి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాయని అన్నారు. ఈ పోరాటం విద్యార్థి, యువత ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం విద్య, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ప్రైవేట్ పెట్టుబడిదారులకు ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు. దేశంలోని సుమారు 23 లక్షల మంది నీట్ అభ్యర్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఉద్యమించి తమ శక్తిని చాటుకున్నారని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పోలేపల్లి ఉదయ్ కుమార్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పునరుద్ధరించాలంటే బాధ్యులైన వారు జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులు, యువత, కార్మికులు, రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని పోలేపల్లి ఉదయ్ కుమార్ తెలిపారు.

