- వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి – మండల వ్యవసాయ అధికారి శివరామ్
మాడ్గులపల్లి, జూలై 22 (నవజ్యోతి ప్రతినిధి) ఎల్ నినో ప్రభావం కారణంగా రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గడంతో పాటు, భూగర్భ జలాల లభ్యత కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నందున, రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి సాగును తగ్గించి, తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని, మండల వ్యవసాయ అధికారి శివరామ్ సూచించారు. ఈ సందర్భంగా మాడ్గులపల్లి మండలంలోని చెరువుపల్లి గ్రామంలో రైతుల పొలాలను సందర్శించిన ఆయన, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను వివరించి రైతులతో చర్చించారు. నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళికను ముందుగానే రూపొందించుకోవాలని, వర్షాధార పంటలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల వంటి తక్కువ నీరు అవసరమయ్యే పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించడం, నీటి సంరక్షణ పద్ధతులను పాటించడం, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా సాగు వ్యయాన్ని తగ్గించడంతో పాటు పంట నష్టాలను కూడా నివారించవచ్చని రైతులకు అవగాహన కల్పించారు. రైతులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల ఎంపిక, సాగు విధానాలను అనుసరిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు నితిన్, సంతోష్, గ్రామ సర్పంచ్ సైదిరెడ్డి, రైతులు స్టాలిన్, బాబు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

