అమీన్పూర్, జూలై 9(నవజ్యోతి ప్రతినిధి):
అమీన్గ్రా పూర్మ డివిజన్ప పరిధిలోని కిష్టారెడ్డి పేట్ ప్లాట్ నంబర్లు 270, 271లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ చట్టం-1955లోని సెక్షన్ 461-ఏ ప్రకారం సీలింగ్ ఆదేశాలు జారీ చేశారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సర్వే నంబర్లు 202 నుంచి 207, 211, 219లో ఉన్న రెండు వ్యక్తిగత భవనాలను అనుమతి లేకుండా ఒకే నిర్మాణంగా విలీనం చేసి, అదనంగా సెల్లార్ నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. అంతేకాకుండా, స్టిల్ట్ + మూడు అంతస్తుల నివాస భవనంగా మంజూరైన అనుమతులకు విరుద్ధంగా భవనాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ నిర్మాణాలు జీహెచ్ఎంసీ చట్టం-1955, బిల్డింగ్ బై-లాస్, టీఎస్-బీపాస్ చట్టం-2020 మరియు తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం-2019 నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు.
ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ తగిన వివరణ అందకపోవడంతో భవనాలను సీల్ చేయాలని డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అక్రమ నిర్మాణాలపై ఇకపై కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.

