📄 ePaper
Wednesday, September 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రసూతి సెలవు తర్వాత అదే హోదాలో విధుల్లోకి రావాల్సిందే!

ప్రసూతి సెలవు తర్వాత అదే హోదాలో విధుల్లోకి రావాల్సిందే!

బాధ్యతలు, అధికారం, స్థాయి తగ్గిస్తే వివక్షగానే పరిగణిస్తాం: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 1 (నవజ్యోతి ప్రతినిధి):
ప్రసూతి సెలవుల అనంతరం ఉద్యోగంలోకి తిరిగి వచ్చే మహిళను, సెలవులకు ముందు పనిచేసిన అదే హోదా, బాధ్యతలు, అధికారాలతో తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రసూతి కారణంగా ఆమె బాధ్యతలు, అధికారం లేదా ఉద్యోగ స్థాయిని తగ్గించేలా బదిలీ లేదా పునర్వ్యవస్థీకరణ చేస్తే అది వివక్షగా పరిగణించే అవకాశం ఉందని పేర్కొంది.

హోదా, జీతం మాత్రమే కొనసాగిస్తే సరిపోదు

జస్టిస్‌ సచిన్‌ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం Rakhi Bisht v. Union of India and Anr కేసులో ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళకు అదే డిజిగ్నేషన్‌, అదే వేతనం కొనసాగించడం మాత్రమే సరిపోదని కోర్టు స్పష్టం చేసింది.

ఆమెకు అప్పగించే విధులు, నిర్ణయాధికారం, రిపోర్టింగ్‌ వ్యవస్థ, పర్యవేక్షణ బాధ్యతలు, పనిలో స్థాయి, భవిష్యత్‌ ప్రమోషన్లు, పనితీరు మదింపు వంటి అంశాల్లోనూ ప్రతికూల మార్పులు ఉండకూడదని పేర్కొంది.

ప్రసూతి కారణంగా బాధ్యతలు తగ్గించొద్దు

ప్రసూతి సెలవుల సమయంలో మహిళ ఉద్యోగిని ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా రక్షించే నిబంధనలు కేవలం ఉద్యోగం నుంచి తొలగించడం లేదా జీతం తగ్గించడానికే పరిమితం కావని కోర్టు తెలిపింది. ఉద్యోగంలోని వాస్తవ స్వభావం, బాధ్యతలు, అధికారాలు, హోదా కూడా ‘conditions of service’లో భాగమేనని స్పష్టం చేసింది.

14 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగి కేసు

సుమారు 14 ఏళ్ల అనుభవం ఉన్న చార్టర్డ్‌ అకౌంటెంట్‌ రాఖీ బిష్ట్‌ తన ప్రసూతి సెలవుల అనంతరం తనను తక్కువ స్థాయి, క్లరికల్‌ తరహా విధుల్లోకి పరిమితం చేశారని కోర్టును ఆశ్రయించారు. తన రిపోర్టింగ్‌ టీమ్‌ను తొలగించడంతో పాటు మేనేజ్‌మెంట్‌ సమావేశాలకు కూడా దూరం పెట్టారని ఆమె ఆరోపించారు.

అయితే సంస్థ మాత్రం తన హోదా, జీతం, వార్షిక ఇంక్రిమెంట్‌ కూడా కొనసాగాయని, ఎలాంటి డిమోషన్‌ చేయలేదని వాదించింది. ఈ వాదనను పరిశీలించిన కోర్టు.. కేవలం హోదా, వేతనం మారలేదన్న కారణంతో ఉద్యోగి హక్కులు రక్షించబడినట్లుగా భావించలేమని పేర్కొంది.

రాజ్యాంగ హక్కుల పరిరక్షణ

మాతృత్వ హక్కులకు సంబంధించిన రక్షణలు రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 14, 15, 21లోని సమానత్వం, గౌరవం, పునరుత్పత్తి స్వేచ్ఛ వంటి హక్కులతో ముడిపడి ఉన్నాయని కోర్టు పేర్కొంది. అందువల్ల ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగ వివాదమైనప్పటికీ ఈ అంశంపై రిట్‌ పిటిషన్‌ను విచారించేందుకు కోర్టుకు అధికార పరిధి ఉందని స్పష్టం చేసింది.

కేంద్రానికి 6 నెలల గడువు

ప్రసూతి సెలవుల అనంతరం ఉద్యోగంలోకి తిరిగి వచ్చే మహిళల పునర్నియామకం, లాక్టేషన్‌ సపోర్ట్‌, క్రెచ్‌ వివరాల వెల్లడింపు, ఫిర్యాదుల పరిష్కారానికి గడువులు వంటి అంశాలపై 6 నెలల్లో నిబంధనలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

ఈ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి రూపొందించాలని సూచించింది.

రూ.10 లక్షల పరిహారం

రాఖీ బిష్ట్‌కు రూ.10 లక్షల పరిహారం, రూ.1.5 లక్షల న్యాయ ఖర్చులను 8 వారాల్లో చెల్లించాలని ఆమె ప్రైవేట్‌ సంస్థను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

కోర్టు స్పష్టత: ప్రసూతి సెలవుల తర్వాత మహిళ ఉద్యోగిని అదే డిజిగ్నేషన్‌, జీతంతో తిరిగి తీసుకోవడం మాత్రమే కాదు.. ఆమె విధులు, అధికారం, ఉద్యోగ స్థాయి, కెరీర్‌ అవకాశాలను కూడా కాపాడాల్సిందే.
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!