ఆరోగ్యశ్రీలో 22 ఏళ్లుగా సేవలందిస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ల (DEOs)ను విధుల నుంచి తొలగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రంగా ఖండించారు.
నిన్న జీతాల కోసం ఎదురుచూపులు.. నేడు ఉద్యోగాల నుంచే తొలగింపులా?
నిన్నటి వరకు జీతాల కోసం ఎదురుచూసిన ఉద్యోగులను నేడు ఉద్యోగాల నుంచే తొలగించడం కంటే దుర్మార్గం ఏముంటుందని హరీశ్రావు ప్రశ్నించారు. ఉద్యోగ భద్రత కల్పించాల్సిన ప్రభుత్వమే ఆరోగ్యశ్రీలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న DEOల ఉపాధిని దెబ్బతీయడం దురదృష్టకరమన్నారు.
22 ఏళ్లుగా సేవలందిస్తున్న ఉద్యోగులను ఒక్క నిర్ణయంతో రోడ్డున పడేయడం న్యాయమా అని ప్రశ్నించారు. తగిన జీతాలు, ఉద్యోగ భద్రత లేకపోయినా ఇన్నేళ్లుగా సేవలందించిన వారి సేవలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు.
కుటుంబాల పరిస్థితినీ పరిగణనలోకి తీసుకోవాలి
దీర్ఘకాలంగా పనిచేస్తున్న DEOల అనుభవంతో పాటు వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని హరీశ్రావు సూచించారు. ఉద్యోగాల నుంచి తొలగించడం కాకుండా వారి సేవలను కొనసాగించే మార్గాలను ప్రభుత్వం అన్వేషించాలని అన్నారు.
ఇతర ప్రభుత్వ విభాగాల్లో సర్దుబాటు చేయాలి
ఆరోగ్యశ్రీ DEOలను తొలగించడానికి బదులుగా అవసరమున్న ఇతర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ పథకాల్లో వారిని సర్దుబాటు చేసి వారి సేవలను కొనసాగించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న సిబ్బందిని కోల్పోవడం వల్ల వ్యవస్థకూ నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.
నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి
ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి, ఆరోగ్యశ్రీ DEOలకు ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు.

