ముంబై, సెప్టెంబర్ 1 (నవజ్యోతి ప్రతినిధి):
మహారాష్ట్రను 2029 నాటికి పూర్తిగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మాదకద్రవ్యాల సాగు, తయారీ, రవాణా, విక్రయం, వినియోగంపై కఠిన చర్యలతో పాటు ప్రజల్లో భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సమగ్ర విధానాన్ని ఆమోదించింది.
దేశంలోనే తొలిసారిగా అన్ని ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తూ ‘Whole-of-Government Approach’తో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా, డివిజన్, మంత్రిత్వ శాఖ స్థాయి వరకు బాధ్యతలు కేటాయించారు.
గ్రామం నుంచి మంత్రిత్వ శాఖ వరకు బాధ్యతలు
డ్రగ్స్ నియంత్రణను కేవలం పోలీస్ శాఖకే పరిమితం చేయకుండా పలు ప్రభుత్వ విభాగాలను ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు. ప్రతి శాఖ డిప్యూటీ సెక్రటరీ స్థాయి నోడల్ అధికారిని నియమించనుంది.
అన్ని శాఖలు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ANTF)తో సమన్వయం చేసుకోవాలి. డ్రగ్స్ తయారీ, రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
2027 నుంచి స్కూళ్లలో డ్రగ్స్ పాఠం
2027 విద్యా సంవత్సరం నుంచి 5వ తరగతి ఆపై తరగతుల్లో కనీసం ఒక డ్రగ్స్ అవగాహన పాఠాన్ని పాఠ్యాంశంలో చేర్చనున్నారు. డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించే పాఠశాలలకు ‘మై స్కూల్, బ్యూటిఫుల్ స్కూల్–ఫేజ్ 3’లో అదనపు మార్కులు ఇవ్వనున్నారు.
డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం
అక్రమ మాదకద్రవ్యాల తయారీకి ఉపయోగించే పంటల సాగుతో పాటు డ్రగ్స్ తయారీ, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. హోం, రవాణా, పోర్టులు, న్యాయశాఖలు అమలుపై దృష్టి పెట్టనున్నాయి. రెవెన్యూ, వ్యవసాయ, అటవీ శాఖలు సరఫరా మూలాలను అడ్డుకునే బాధ్యతలు చేపట్టనున్నాయి.
సింథటిక్ డ్రగ్స్పై ప్రత్యేక నిఘా
అక్రమంగా తయారయ్యే సింథటిక్ డ్రగ్స్పై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, పరిశ్రమల శాఖలు చర్యలు తీసుకోనున్నాయి. విద్యా సంస్థలను డ్రగ్స్ రహిత క్యాంపస్లుగా తీర్చిదిద్దేందుకు ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టనుంది.
చికిత్స.. పునరావాసానికి ప్రాధాన్యం
డ్రగ్స్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు బాధితులకు డీ-అడిక్షన్, చికిత్స, పునరావాస సేవలను విస్తరించనున్నారు. సామాజిక న్యాయం, ప్రజారోగ్యం, వైద్య విద్య, పట్టణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి తదితర శాఖలకు ఈ బాధ్యతలు అప్పగించారు.
అమలు, సరఫరా నియంత్రణ, డిమాండ్ తగ్గింపు, డీ-అడిక్షన్–చికిత్స–పునరావాసం అనే నాలుగు ప్రధాన స్తంభాలపై మహారాష్ట్ర డ్రగ్స్ నిర్మూలన విధానం కొనసాగనుంది. ప్రతి ఏడాది జూన్ 26న అత్యుత్తమ డ్రగ్స్ రహిత జిల్లాకు అవార్డు ఇవ్వనున్నారు.

