పద్మానగర్లో కార్మికుడి దుర్మరణం..బిల్డర్ల నిర్లక్ష్యంపై ప్రశ్నలు
నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నా.. కార్మికుల భద్రత మాత్రం ఎక్కడా కనిపించడంలేదు.
పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని పద్మానగర్ ఫేజ్-2లో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద జరిగిన ప్రమాదం ఇందుకు నిదర్శనంగా నిలిచింది.
భవనం పైఅంతస్తు స్లాబ్ పనుల కోసం క్రేన్తో మెటీరియల్ తరలిస్తుండగా వైర్ అకస్మాత్తుగా తెగిపోవడంతో
మెటీరియల్తో పాటు కిందపడిన కుమార్ (33) అనే కార్మికుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు.
వైర్ తెగిందా?..భద్రతా చర్యలే విఫలమయ్యాయా?
పైఅంతస్తుకు నిర్మాణ సామగ్రిని తరలిస్తున్న సమయంలో క్రేన్ వైర్ తెగిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
క్షణాల్లో జరిగిన ఘటన ఓ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
నిర్మాణ ప్రదేశంలో క్రేన్ నిర్వహణ, వైర్ల సామర్థ్యం, కార్మికుల భద్రతకు తీసుకున్న చర్యలపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అంతస్తులు పెరుగుతున్నా..భద్రతా ప్రమాణాల మాటేమిటి?
భవనాలకు అంతస్తుల మీద అంతస్తులు జోడించడంపైనే దృష్టిపెట్టి, నిర్మాణ సమయంలో కార్మికుల ప్రాణ రక్షణకు అవసరమైన
భద్రతా ప్రమాణాలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.
క్రేన్లు, లిఫ్టింగ్ పరికరాలు, రక్షణ వలలు, సేఫ్టీ గేర్ వంటి అంశాలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో
తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు.
ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

