ఖమ్మం జిల్లాలో 2,45,213 మంది లబ్ధిదారులకు రూ.57.05 కోట్ల సబ్సిడీతో 18,69,122 గ్యాస్ సిలిండర్లు
మొదటి విడత 16,243 ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు చేయగా, 10,396 ఇళ్లు పూర్తి – రూ.454.97 కోట్ల ఆర్థిక సహాయం
మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో రూ.326.73 కోట్ల ఆదా – 6.14 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు
ఖమ్మం జిల్లాలో 2,49,454 కుటుంబాలకు రూ.257.22 కోట్ల సబ్సిడీతో గృహజ్యోతి ఉచిత విద్యుత్
5 నియోజకవర్గాల్లో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణాలు
మున్నేరు వరదల నియంత్రణకు రూ.525.36 కోట్లతో రక్షణ గోడ
విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణ
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
ఖమ్మం, 15 ఆగస్టు (నవజ్యోతి ప్రతినిధి):
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అన్ని రంగాల్లో వేగంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉదయం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ కవాతు నుంచి గౌరవ వందనం స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులకు హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు పెంచే మహత్తరలక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత:
రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతు భరోసా పథకం ద్వారా జిల్లాలో 3,41,913 మంది రైతులకు రూ.427.97 కోట్లు, పంట రుణమాఫీ క్రింద 1,31,760 మంది రైతులకు రూ.912.10 కోట్లు, రైతు బీమా ద్వారా 803 మంది రైతు కుటుంబాలకు రూ.40.15 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.
అదేవిధంగా 44,568 మంది రైతుల నుంచి రూ.681.49 కోట్ల విలువైన 2,83,956.397 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశామని చెప్పారు. యాసంగి 2025–26లో 20,085 మంది రైతుల నుంచి 14,62,411.60 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.346.82 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా చెల్లించామని తెలిపారు.
జిల్లాలోని 129 రైతు వేదికలు, 62 వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల ద్వారా ప్రత్యామ్నాయ పంటలు, ప్రకృతి వ్యవసాయం, వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన సాగు పద్ధతులపై రైతులకు నిరంతర శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,098 ఎకరాల్లో కొత్తగా ఆయిల్పామ్ సాగు చేపట్టేందుకు రూ.29.37 కోట్ల రాయితీ అందించామని, సూక్ష్మ నీటి సేద్య పథకం క్రింద 3,082 ఎకరాల్లో డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవస్థలు ఏర్పాటు చేసి రూ.7.37 కోట్ల రాయితీ అందించామని తెలిపారు.
విద్యారంగంలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానం:
సెంట్రలైజ్డ్ మెకనైజ్డ్ కిచెన్ వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకుల, రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఖమ్మం జిల్లాలో బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 66 వేల 882 మంది విద్యార్థుల నమోదు జరిగిందని తెలిపారు. ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉండగా, పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో 5వ స్థానంలో ఉందన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించేందుకు ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి రూ.200 కోట్ల వ్యయంతో మొత్తం 5 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నా మని చెప్పారు. వైరా నియోజక వర్గంలోని ఏన్కూర్, సత్తుపల్లి నియోజక వర్గంలోని తల్లాడ, పాలేరు నియోజక వర్గంలోని తిరుమలాయపాలెం, మధిర నియోజక వర్గంలోని సిరిపురంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని చెప్పారు.మధిరలో నూతనంగా మంజూరైన ఇంజనీరింగ్ కళాశాలకు యూనివర్సిటీ అనుమతులు లభించాయని, ప్రస్తుత సంవత్సరం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
వైద్య రంగంలో ఆధునిక సదుపాయాల కల్పన:
ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రూ.23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ భవనాన్ని పూర్తి చేశామని చెప్పారు. CT స్కాన్, 2D ECHO, అల్ట్రాసౌండ్, 20 వెంటిలేటర్లు, క్యాథ్ ల్యాబ్,తదితర ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వైరాలో రూ.37.50 కోట్లతో 100 పడకల ఏరియా ఆసుపత్రి, కూసుమంచిలో రూ.45.50 కోట్లతో 100 పడకల ఏరియా ఆసుపత్రి, తిరుమలాయపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను రూ.26 కోట్లతో 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
సాగునీటి ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు:
సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా పాలేరు లింక్ కాలువతో 1,38,790 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించ నున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
మున్నేరు–పాలేరు లింక్ కాలువను రూ.107.65 కోట్లతో నిర్మిస్తున్నామని, జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని రూ.630.30 కోట్లతో చేపట్టామని చెప్పారు. మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు అదనపు నీరు అందించే పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.
18-L 8.69 కిలోమీటర్ల కాలువ ద్వారా 7,115 ఎకరాల కొత్త ఆయకట్టు, 1,18,933 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఖమ్మం నగరంలో మున్నేరు వరదల నియంత్రణకు రూ.525.36 కోట్లతో రక్షణ గోడ నిర్మిస్తున్నామని తెలిపారు.
పునరుత్పాదక ఇంధనానికి ప్రోత్సాహం:
బోనకల్ మండలంలోని 22 గ్రామాలతో పాటు సిరిపురం, లక్ష్మీపురం, చెరువు మాదారం, రఘునాధపాలెం, శ్రీరామగిరి, లచ్చగూడెం గ్రామాల్లో మోడల్ సోలార్ గ్రామాల అభివృద్ధికి రూ.16.04 కోట్లతో పనులు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. జిల్లాలో నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం 128 విద్యుత్ సబ్ స్టేషన్లు పనిచేస్తుండగా, అదనంగా 38 నూతన సబ్ స్టేషన్లు మంజూరు చేయగా, 9 సబ్స్టేషన్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఖమ్మం నగరంలో మొట్టమొదటి ఇన్డోర్ సబ్స్టేషన్ను రూ.6.50 కోట్లతో మంజూరు చేశామని తెలిపారు.
రాజులపాలెంలో 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ ప్రారంభించగా, మరో ప్లాంట్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. 27 మోడల్ సోలార్ గ్రామాల్లో రూఫ్టాప్ సోలార్, సౌర పంపుసెట్ల ఏర్పాటు జరుగుతోందన్నారు. పిఎం కుసుమ్ క్రింద 1,795 మెగావాట్ల సామర్థ్యానికి ఒప్పందాలు పూర్తయ్యాయని, 379 ప్రభుత్వ పాఠశాలల్లో 1,768 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
మహిళా సాధికారతకు భారీగా ఆర్థిక సహాయం:
ఇందిరా మహిళా డెయిరీ పైలట్ ప్రాజెక్టు క్రింద మధిర నియోజకవర్గంలోని 5 మండలాల్లో తొలి దశలో రూ.2 కోట్ల వ్యయంతో 125 యూనిట్లకు రెండు పాడి గేదెల చొప్పున మంజూరు చేశామని తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం 3,239 మహిళా సంఘాలకు రూ.330.69 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, 409 సంఘాలకు రూ.12.05 కోట్ల స్త్రీనిధి రుణాలు, 52,059 మహిళా సంఘాలకు రూ.57.15 కోట్ల వడ్డీలేని రుణాలు, 3,609 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.66.67 కోట్ల రుణాలు అందించామని తెలిపారు.
మెప్మా ద్వారా ఏప్రిల్ నుండి ఆగస్టు 2026 వరకు 495 మహిళా సంఘాలకు రూ.71.54 కోట్ల బ్యాంకు రుణాలు, ఇందిర మహిళా శక్తి క్రింద 209 వ్యక్తిగత యూనిట్లకు రూ.7.70 కోట్లు, 14 గ్రూపులకు రూ.1.66 కోట్ల రుణాలు అందించామని చెప్పారు.
సంక్షేమ పథకాలతో ప్రజలకు ఆర్థిక భరోసా
రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీని ప్రారంభిస్తున్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకం క్రింద జిల్లాలో 2,45,213 మంది లబ్ధిదారులకు 18,69,122 గ్యాస్ సిలిండర్లను రూ.57.05 కోట్ల సబ్సిడీ భరిస్తూ రూ.500కే పంపిణీ చేశామని తెలిపారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలు 6,14,48,166 మంది ఉచితంగా ప్రయాణించడం ద్వారా రూ.326.73 కోట్లను ఆదా చేసుకున్నారని చెప్పారు. ఇట్టి మొత్తం ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. గృహజ్యోతి పథకం క్రింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న 2,49,454 కుటుంబాలకు రూ.257.22 కోట్ల సబ్సిడీ భరిస్తూ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు.
జిల్లాలో 2026 జనవరి నుంచి ఆగస్టు వరకు 4,301 మంది కార్మికులకు వివిధ సంక్షేమ పథకాల క్రింద రూ.19.83 కోట్ల ఆర్థిక సహాయం అందించామని చెప్పారు.
ఇందిరమ్మ ఇండ్లతో పేదలకు సొంతింటి కల సాకారం
ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద జిల్లాకు తొలి విడతలో 16,243 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 10,396 ఇళ్ల నిర్మాణం పూర్తైందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. లబ్ధిదారులకు రూ.454.97 కోట్ల ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. రెండో విడతలో 7,800 కొత్త ఇళ్లు, 2,600 పైకప్పు మార్పిడి గృహాలు కలిపి మొత్తం 10,400 గృహాలు అందించనున్నట్లు తెలిపారు.
గ్రామీణ ఉపాధి, త్రాగునీటికి ప్రాధాన్యత
వీబీజీ–రామ్జీ పథకం క్రింద 1.26 లక్షల కుటుంబాలకు 31.53 లక్షల పనిదినాలు కల్పించి రూ.92.32 కోట్ల వేతనాలు చెల్లించామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
జిల్లాలోని 915 గ్రామాల్లో 1,408 ఓవర్హెడ్ సర్వీస్ రిజర్వాయర్ల ద్వారా 24.88 లక్షలకు పైగా గృహాలకు నల్లా కనెక్షన్లతో త్రాగునీరు అందిస్తున్నామని చెప్పారు. అదనంగా 7,889 చేతిపంపులు, 1,307 PWS పథకాలు, 292 సింగిల్ ఫేజ్ మోటార్లు, 271 మంచి నీటి బావుల ద్వారా త్రాగునీటి సరఫరా కొనసాగుతోందని తెలిపారు.
96 సంవత్సరాల తర్వాత భూముల రీ-సర్వే
తెలంగాణలో భూముల సరిహద్దుల వల్ల ఏర్పడుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా దాదాపు 96 సంవత్సరాల తర్వాత ప్రజా ప్రభుత్వం రీ-సర్వే ప్రక్రియ చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. తిరుమలాయ పాలెం మండలం కాకరవాయిలో 3,791.38 ఎకరాలు, సత్తుపల్లి మండలం బేతుపల్లిలో 11,782.09 ఎకరాలు, కూసుమంచి మండలం భాగవత్వీడులో 1,258.17 ఎకరాల్లో రీ-సర్వే కొనసాగుతోందని చెప్పారు. జిల్లాలోని 70 గ్రామాల్లో రీ-సర్వే కార్యక్రమం దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు.
రహదారులు, మౌళిక వసతుల అభివృద్ధి
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద రూ.201.76 కోట్ల అంచనా వ్యయంతో 4,678 సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు మంజూరు చేయగా 3,550 పనులు పూర్తి చేశామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.ఖమ్మం ఆర్అండ్బీ సర్కిల్ పరిధిలో 2,245.68 కిలోమీటర్ల రహదారులతో పాటు రూ.3,169.39 కోట్ల అంచనా వ్యయంతో 179 అభివృద్ధి పనులు మంజూరు కాగా, 68 పనులు పురోగతిలో, 13 పనులు పూర్తయ్యాయని చెప్పారు.
హ్యామ్ క్రింద రూ.1,227.13 కోట్లతో 37 రహదారి పనులు, రూ.180 కోట్లతో మున్నేరు తీగల వంతెన, రూ.130 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రూ.1,583 కోట్లతో కోదాడ– ఖమ్మం ఎన్హెచ్-365A నాలుగు వరుసల రహదారి నిర్మాణం 100 శాతం పూర్తయిందని, ఖమ్మం–దేవరపల్లి ఎన్ హెచ్-365 బిజిలో ప్యాకేజీ–1 పనులు 99 శాతం, ప్యాకేజీ–2, 3 పనులు 100 శాతం పూర్తయ్యాయని చెప్పారు. రూ.678 కోట్లతో వరంగల్–ఖమ్మం ఎన్హెచ్-163జి నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
పరిశ్రమలు, ఉపాధి అవకాశాల విస్తరణ
టీజీ ఐపాస్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.577.74 కోట్ల పెట్టుబడితో 1,836 మందికి ఉపాధి కల్పించే 153 పరిశ్రమలకు సంబంధించిన 319 అనుమతుల దరఖాస్తులు అందగా, 240 అనుమతులను సకాలంలో మంజూరు చేశామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల ద్వారా 211 పరిశ్రమలకు రూ.18.02 కోట్ల పెట్టుబడి రాయితీలు అందించామని, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం క్రింద 155 స్వయం ఉపాధి యూనిట్లకు రూ.5.50 కోట్ల సబ్సిడీ మంజూరు చేసి 575 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు.
క్రీడా రంగంలో ఖమ్మం క్రీడాకారుల ప్రతిభ
2025–26లో జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో 24, రాష్ట్ర స్థాయిలో 314 పతకాలు సాధించి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. సీఎం కప్–2026లో జిల్లా నుంచి 510 మంది రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని 72 పతకాలు సాధించారని చెప్పారు.ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో రూ.8.50 కోట్లతో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం ముగింపు దశకు చేరుకుందని, మధిర మినీ స్టేడియం అభివృద్ధికి రూ.5.50 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.
పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
ఖమ్మం ఖిల్లాకు రూ.15 కోట్లతో రోప్వే, పర్యాటక సౌకర్యాల అభివృద్ధికి పాలేరు సరస్సుకు రూ.5 కోట్లు, నేలకొండపల్లి బౌద్ధ స్తూపానికి రూ.2.50 కోట్లు, మధిర పెద్ద చెరువుకు రూ.6 కోట్లు, మామునూరు పేట చెరువుకు రూ.9 కోట్లు మంజూరు చేశామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.మధిర నియోజకవర్గంలోని చింతకాని లేక్, మాటూరు, చిరుమర్రి, ముత్తారం, కలకోట ట్యాంక్బండ్ లు, బయ్యారం లేక్ అభివృద్ధికి రూ.30.60 కోట్లు మంజూరు చేసి పనులు దశలవారీగా చేపడుతున్నామని చెప్పారు.
ఖమ్మం నగరంతో పాటు మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి
అమృత్ పథకం క్రింద ఖమ్మం నగరంలో రూ.229.08 కోట్లతో త్రాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేసి 75,318 గృహాలకు నల్లా కనెక్షన్లు, 25 నీటి నిల్వ ట్యాంకుల ద్వారా సురక్షిత త్రాగునీరు అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. 2024లో ఏర్పాటు చేసిన ఏదులాపురం మున్సిపాలిటీలో మౌళిక సదుపాయాల అభివృద్ధికి రూ.15 కోట్లతో పనులు చేపట్టి 60 శాతానికి పైగా పూర్తి చేశామని చెప్పారు. రహదారులు, డ్రైన్లు, పార్కులు, పారిశుధ్యం తదితర అభివృద్ధి పనులకు రూ.75 కోట్లు, త్రాగునీటి మౌళిక సదుపాయాలకు రూ.11 కోట్లు, ట్యాంక్ బండ్ అభివృద్ధికి రూ.1.84 కోట్లు కేటాయించి పనులు చేపట్టామని తెలిపారు.
మధిరలో టియుఎఫ్ఐడిసి ద్వారా రూ.128 కోట్లతో భూగర్భ మురుగు కాలువల వ్యవస్థ, 4 ఎస్టీపీ లు, 102 కిలోమీటర్ల సీవర్ లైన్ల నిర్మాణం చేపట్టగా ఇప్పటికే 60.40 కిలోమీటర్ల పైప్లైన్, 2,245 మ్యాన్హోల్స్, 777 ఇన్స్పెక్షన్ ఛాంబర్లు పూర్తయ్యాయని చెప్పారు. అమృత్–2.0 క్రింద మధిరలో రూ.17.09 కోట్లతో మంచినీటి పథకం, రూ.15 కోట్ల నగరాభివృద్ధి పనులు 88 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఎస్డిఎఫ్ క్రింద రూ.140 కోట్లతో ప్రధాన వర్షపు నీటి కాలువలు, వైరా నదికి రిటైనింగ్ వాల్ నిర్మిస్తూ వరద ముంపుకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నా మని చెప్పారు.
వైరా మున్సిపాలిటీలో అమృత్–2.0 క్రింద రూ.26.87 కోట్లతో త్రాగునీటి పథకం, రూ.6 కోట్లతో ప్రధాన వర్షపు నీటి కాలువ,రహదారి అభివృద్ధి, రూ.4.75 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. వైరా పట్టణంలో రూ.7.40 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్, రూ.46.42 కోట్లతో వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని చెప్పారు.
కల్లూరు మున్సిపాలిటీలో నగరాభివృద్ధి పథకం క్రింద రూ.15 కోట్లతో 34 పనులు చేపట్టగా, రూ.1.50 కోట్లతో 4 పనులు పూర్తయ్యాయని, రూ.13.50 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.సత్తుపల్లి మున్సిపాలిటీలో నగరాభివృద్ధికి రూ.15 కోట్లతో 34 పనులు చేపట్టగా, 10 పనులు పూర్తయ్యాయని చెప్పారు. టియుఎఫ్ఐడిసి
క్రింద రూ.7 కోట్లతో అభివృద్ధి పనులు, అమృత్–2.0 క్రింద రూ.19.20 కోట్లతో మంచినీటి పథకంలో 24 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణం పూర్తయిందని తెలిపారు.
అనంతరం ఫ్రీడమ్ ఫైటర్స్ వేపల వెంకట సుబ్బారావు, గాదె సుగుణ రావు, పుచ్చకాయల రామయ్య, ఎస్.కె. జాన్ మహ్మద్, పంతంగి రాజేశ్వరి, మేడిపల్లి భవానీదేవి, ఆళ్ళ సీతారామయ్య, కె. స్వరాజ్యం, మందపల్లి శశిరేఖమ్మలను ఉప ముఖ్యమంత్రి ఘనంగా సన్మానించారు.
విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. *అభినవ రుద్ర స్కూల్, కెపిఎం స్కూల్, ఏజిహెచ్ఎస్, గొల్లగూడెం, హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్, సంభానీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆసక్తిగా తిలకించి వారి ప్రతిభను అభినందించారు.
ఆకట్టుకున్న ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన:
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా శకటాలను ఏర్పాటు చేశాయి. హౌసింగ్ శాఖ, పౌర సరఫరాల శాఖ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, డిఆర్డిఏ., రవాణా శాఖ, అటవీ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలను ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆయా శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా రూపొందించిన శకటాలను పరిశీలించి సంబంధిత అధికారులను అభినందించారు.
అనంతరం వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను సందర్శించి ఆయా శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విశిష్ట సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ఉప ముఖ్యమంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సిపి సునీల్ దత్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ఖమ్మం మునిసిపల్ కార్పోరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డిఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పరాస్ కుమార్, జిల్లా అధికారులు, ఆర్డీఓ శ్రీనివాస్, పోలీసు, స్వాతంత్ర్య సమర యోధులు

