యువత ఆలోచనలు, నిర్ణయాలే వికసిత్ భారత్కు పునాది.. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచన…
న్యూఢిల్లీ, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి): సమాజంలో ఉన్న సమస్యలను ప్రశ్నించే ధైర్యంతో పాటు వాటికి పరిష్కారాలు చూపించే సామర్థ్యాన్ని యువత పెంపొందించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఢిల్లీ ఐఐటీ 57వ స్నాతకోత్సవంలో గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సాంకేతికత వేగంగా మారుతున్న నేపథ్యంలో నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
డిగ్రీ సాధించడం విద్యాభ్యాసానికి ముగింపు కాదని, దేశానికి ఉపయోగపడే ఆలోచనలు, ఆవిష్కరణలకు అది ఆరంభం కావాలని మోదీ అన్నారు. సవాళ్లను చూసి వెనుకడుగు వేయకుండా కొత్త పరిష్కారాలను అన్వేషించే వారికి అవే అవకాశాలుగా మారతాయని పేర్కొన్నారు. యువత సాధికారతే దేశ ప్రగతికి బలమని చెప్పారు.
రాబోయే మూడు దశాబ్దాల్లో యువత తీసుకునే నిర్ణయాలు వికసిత్ భారత్ నిర్మాణంపై ప్రభావం చూపుతాయని ప్రధాని అన్నారు. ఉద్యోగం, జీతం, స్టార్టప్ విజయాలను ఇతరులతో పోల్చుకోవడం కంటే ప్రతిరోజూ తమను తాము మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి తరానికీ కొన్ని జాతీయ బాధ్యతలు ఉంటాయని, తమ లక్ష్యాల్లో దేశాభివృద్ధికి స్థానం కల్పించాలని కోరారు.
విద్యతో పాటు అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. స్నాతకోత్సవంలో పతకాలు సాధించిన విద్యార్థుల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో మరింత మంది మహిళలు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో 587 మంది పీహెచ్డీ స్కాలర్లతో పాటు 3 వేల మందికిపైగా విద్యార్థులకు డిగ్రీలు అందించారు. సోనిపట్ క్యాంపస్లో ఏఐ ఆధారిత హైపర్ఫార్మెన్స్ సూపర్కంప్యూటర్ ‘పరమ్ ప్రజ్ఞ’ను ప్రధాని ప్రారంభించారు.

