7,393 లింకులు, టెలిగ్రామ్ ఛానళ్ల బ్లాక్కు ఆదేశాలు
న్యూఢిల్లీ, ఆగస్టు 5 (నవజ్యోతి ప్రతినిధి): ఆన్లైన్లో సినిమాల పైరసీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. అక్రమంగా సినిమాలను ప్రసారం చేస్తున్న 7,393 యూఆర్ఎల్లను (URLs) బ్లాక్ చేయాలని సంబంధిత మధ్యవర్తి సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. వీటిలో 1,263 వెబ్సైట్లు, 4,996 టెలిగ్రామ్ ఛానళ్లు ఉన్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ వెల్లడించింది.
సినిమాటోగ్రాఫ్ (సవరణ) చట్టం–2023 అమల్లోకి వచ్చిన తర్వాత పైరసీపై చర్యలు మరింత వేగవంతమయ్యాయని కేంద్రం తెలిపింది. ఐటీ చట్టం–2000, ఐటీ రూల్స్–2021 ప్రకారం ప్రభుత్వం లేదా కోర్టు ఆదేశాల మేరకు అక్రమ కంటెంట్ను వెంటనే తొలగించడం లేదా యాక్సెస్ నిలిపివేయడం తప్పనిసరి అని పేర్కొంది.
కాపీరైట్ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలోని జాయింట్ సెక్రటరీ (ఫిల్మ్స్)కు టేక్డౌన్ నోటీసులు జారీ చేసే అధికారాన్ని కల్పించింది. అలాగే కాపీరైట్ హోల్డర్ల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, పైరసీ కంటెంట్ను వేగంగా తొలగించే ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది.
సినీ పరిశ్రమకు పైరసీ వల్ల కలుగుతున్న భారీ ఆదాయ నష్టాన్ని తగ్గించడం, కాపీరైట్ హక్కులను సమర్థంగా రక్షించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

