మిర్యాలగూడ, ఆగస్టు 5 (నవజ్యోతి ప్రతినిధి) పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దివ్యాంగుల గుర్తింపు కార్డు (యూడీఐడీ) కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఆసుపత్రిలోని యూడీఐడీ కేంద్రాన్ని పరిశీలించి, వైద్యాధికారులను కేంద్రం పనితీరు, దివ్యాంగులకు అందించనున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దివ్యాంగులకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా అందుబాటులోకి తీసుకురావడంలో ప్రత్యేక దివ్యాంగుల గుర్తింపు కార్డు (యూడీఐడీ) కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి దివ్యాంగుడికి వేగవంతంగా గుర్తింపు కార్డులు జారీ చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి రమణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్పర్సన్ గుడిపాటి శిరీష నవీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీజా రెడ్డి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, ఆసుపత్రి వైద్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

