కోనాపూర్ పీఏసీఎస్పై విచారణ త్వరగా పూర్తి చేసి వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్..
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) మాజీ చైర్మన్, మాజీ ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డిపై వస్తున్న అవినీతి ఆరోపణలను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. సోమవారం కోనాపూర్ పీఏసీఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ వైస్ ప్రెసిడెంట్ కిషన్, మాజీ ఉపసర్పంచ్ దీపక్రెడ్డి, హరికృష్ణ, సుశీల్కుమార్ తదితరులు రాజకీయ కక్షసాధింపులో భాగంగానే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
పీఏసీఎస్ అభివృద్ధికి దేవేందర్రెడ్డి కృషి చేశారన్న నేతలు
దేవేందర్రెడ్డి హయాంలో కోనాపూర్ గ్రామంతో పాటు పీఏసీఎస్ గణనీయమైన అభివృద్ధి సాధించిందని హరికృష్ణ తెలిపారు. బీటీ, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, డంపింగ్ యార్డు, నర్సరీ, శ్మశానవాటిక, బీసీ బంధు వంటి అభివృద్ధి పనులతో పాటు పీఏసీఎస్ ఆధ్వర్యంలో గోదాం, వాణిజ్య సముదాయాలు, 20కి పైగా దుకాణాలు, పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి సంఘానికి శాశ్వత ఆదాయ వనరులు కల్పించారని పేర్కొన్నారు.
విచారణ పూర్తి చేసి నిజాలు వెల్లడించాలని డిమాండ్
పీఏసీఎస్లో అవినీతి జరిగిందన్న ప్రచారం రాజకీయ ప్రేరేపితమని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా కాలమైనా విచారణ పూర్తి చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని నేతలు అన్నారు. విచారణను త్వరగా పూర్తి చేసి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ప్రభుత్వాన్ని కోరారు.
వేర్వేరు నివేదికలపై స్పష్టత కోరిన నేతలు
మాజీ ఉపసర్పంచ్ దీపక్రెడ్డి మాట్లాడుతూ ఒకే రికార్డుల ఆధారంగా ఇద్దరు విచారణ అధికారులు వేర్వేరు నివేదికలు ఇవ్వడం సందేహాలకు దారితీస్తోందన్నారు. ఒక నివేదికలో రూ.2.26 కోట్లు, మరో నివేదికలో రూ.1.60 కోట్లుగా పేర్కొనడంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సామాజిక విభేదాలు రెచ్చగొట్టొద్దు
కుల వివాదాలను రెచ్చగొట్టి గ్రామంలో సామాజిక విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు, భూమిలేని పేద దళితులకు ప్రభుత్వం భూములు కేటాయించాలని కోరారు. సమావేశంలో సంజీవరెడ్డి, కదారి బీరయ్య, వెంకటరెడ్డి, సునీల్కుమార్, రవి నాయక్, నర్వ సామెల్, మైపాల్రెడ్డి, ఇమ్మానియేల్, కిష్టారెడ్డి, రాంరెడ్డి, రవికాంత్, రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

