మౌలిక వసతులు, వైద్య సేవల విస్తరణపై చర్చ.. ప్రజలకు మెరుగైన చికిత్సే ప్రభుత్వ లక్ష్యమన్న షబ్బీర్ అలీ!
హైదరాబాద్, ఆగస్టు 3 (నవజ్యోతి ప్రతినిధి):
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు.
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, వైద్య సేవల విస్తరణ, అవసరమైన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నియామకం, రోగులకు అందుతున్న సేవల నాణ్యత, వైద్య సౌకర్యాల బలోపేతంపై జిల్లా ఎమ్మెల్యేలు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేసి, అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రజలకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో పాటు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

