నేటి రాత్రి పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్, జూలై 2: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేటి రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడే అవకాశం ఉండటంతో స్థానిక ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు.
అదే సమయంలో ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకుండా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారుల సూచనలు పాటించాలని అధికారులు తెలిపారు.

