భిక్కనూరు, ఆగస్టు 14 (నవజ్యోతి ప్రతినిధి):
భిక్కనూరు మండలంలో కాపర్ దొంగలు వరుసగా విద్యుత్ పరికరాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మూడు రోజుల క్రితం రామేశ్వర్పల్లిలో ఏడు ట్రాన్స్ఫార్మర్లపై దాడి చేసి నాలుగు ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్లను ఎత్తుకెళ్లిన దొంగలు.. తాజాగా అదే ప్రాంతంలో ఒకే రాత్రి
12 బోర్ మోటార్ల కేబుళ్లను స్టార్టర్ బాక్స్ నుంచి మోటార్ వరకు కట్ చేసి
పరారయ్యారు. రామేశ్వర్పల్లిలో గతంలోనూ ఇదే తరహాలో మోటార్ కేబుల్ వైర్లను కట్ చేసి చోరీ చేసిన ఘటన జరిగింది. దీంతో ఇప్పుడు జరిగిన చోరీ
అదే కాపర్ దొంగల ముఠా పనిగా స్పష్టమవుతోంది. వరుస చోరీలతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
ట్రాన్స్ఫార్మర్లు.. మోటార్ కేబుళ్లు.. ఒకే ముఠా!
రామేశ్వర్పల్లిలో గతంలో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇప్పుడు మళ్లీ అదే ప్రాంతంలో మోటార్ కేబుళ్లను కట్ చేశారు. గత ఘటనలోనూ కాపర్ వైర్లనే లక్ష్యంగా చేసుకోగా.. తాజా ఘటనలోనూ కాపర్ ఉన్న మోటార్ కేబుళ్లను మాత్రమే కట్ చేసి తీసుకెళ్లారు.
ఒకే ప్రాంతంలో.. ఒకే తరహాలో.. కాపర్ను లక్ష్యంగా చేసుకుని వరుసగా చోరీలు జరగడంతో
ట్రాన్స్ఫార్మర్ చోరీలు, మోటార్ కేబుల్ చోరీల వెనుక ఒకే ముఠా ఉన్నట్లు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గురజకుంట, బస్వాపూర్, రాగట్లపల్లి, పెద్ద మల్లారెడ్డి ప్రాంతాల్లో గతంలోనూ
20కిపైగా ట్రాన్స్ఫార్మర్ చోరీలు
జరిగాయి. గురజకుంటలో కాపర్ ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, అల్యూమినియం ఉన్న వాటిని వదిలేసిన ఘటనలు కూడా నమోదయ్యాయి. దీంతో భిక్కనూరు మండలంలో జరుగుతున్న వరుస చోరీల వెనుక కాపర్ ముఠాల వ్యవహారం స్పష్టంగా కనిపిస్తోంది.
ఐదు చెక్పోస్టులు.. అయినా తప్పించుకుంటున్న దొంగలు
వరుస చోరీల నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే
ఐదు చెక్పోస్టులు
ఏర్పాటు చేసి నిఘా పెంచారు. రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తూ అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రైతులను అప్రమత్తం చేయడంతోపాటు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులకు కూడా సమాచారం అందించారు.
అయినా ఒకే రాత్రి 12 మోటార్ కేబుళ్లు చోరీ కావడం పోలీసులకు సవాల్గా మారింది. చెక్పోస్టులు, ప్రధాన రహదారులపై నిఘాను తప్పించుకుని దొంగలు పొలాల్లోకి వెళ్లే మట్టి రోడ్లు, లింక్ రోడ్లు, కాలువ కట్టలు, సర్వీస్ రోడ్లను ఉపయోగించి చోరీలకు పాల్పడుతున్నారు అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి
పాత చోరీలతో తాజా ఘటనలకు లింక్
రామేశ్వర్పల్లిలో గతంలో జరిగిన మోటార్ కేబుల్ చోరీ, తాజాగా జరిగిన 12 మోటార్ కేబుల్ చోరీ, మూడు రోజుల క్రితం జరిగిన ట్రాన్స్ఫార్మర్ చోరీలను పోలీసులు ఒకదానితో ఒకటి అనుసంధానించి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనల ప్రదేశాలు, చోరీ చేసిన వస్తువులు, కట్ చేసిన విధానం, దొంగలు వెళ్లిన మార్గాలపై వివరాలు సేకరిస్తున్నారు.
ఒకే ప్రాంతాన్ని పదేపదే ఎంచుకోవడం, ట్రాన్స్ఫార్మర్లతోపాటు మోటార్ కేబుళ్లలోని కాపర్ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం ఈ ముఠా వ్యవహారంలో ప్రధాన అంశంగా మారింది.
కాపర్ కొనుగోలుదారులపైనా నిఘా
చోరీ చేసిన కాపర్ను ఎక్కడ విక్రయిస్తున్నారనే అంశంపైనా పోలీసులు దృష్టి సారించారు. గతంలో తెలంగాణలో జరిగిన ట్రాన్స్ఫార్మర్ చోరీ కేసుల్లో దొంగలతోపాటు కాపర్ను కొనుగోలు చేసిన స్క్రాప్ వ్యాపారులను కూడా పోలీసులు అరెస్టు చేసిన సందర్భాలున్నాయి.
భిక్కనూరు ఘటనల్లోనూ దొంగిలించిన కాపర్ ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరికి విక్రయిస్తున్నారు? అనే వివరాలను సేకరిస్తే ముఠా మొత్తం వ్యవహారం బయటపడే అవకాశం ఉంది.
దర్యాప్తులో కీలక అంశాలు
- దొంగలు.. కాపర్ కొనుగోలుదారులు.. స్క్రాప్ వ్యాపారుల మధ్య లింక్
- చోరీ జరిగిన ప్రాంతాల ఆధారంగా రూట్ మ్యాప్ పరిశీలన
- సీసీ కెమెరాల ఫుటేజీ, అనుమానాస్పద వాహనాల కదలికలు
- ట్రాన్స్ఫార్మర్, మోటార్ కేబుళ్ల కట్ విధానం పోల్చిచూడటం
- చోరీలకు సంబంధించిన సమాచారం ముందుగానే చేరుతుందా? అన్న అంశంపై విచారణ
వరుస చోరీలతో రైతుల్లో ఆందోళన
ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం కావడం, మోటార్ కేబుళ్లు కట్ కావడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మోటార్ కేబుళ్లు చోరీ కావడంతో బోర్ల నుంచి నీటిని తోడుకునే పరిస్థితి లేక పంటలకు నీరందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు ట్రాన్స్ఫార్మర్ల చోరీలతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సమయం పడుతోంది.
పోలీసులకు ప్రధాన సవాల్
మండల పరిధిలో గతంలో మోటార్ కేబుల్ చోరీ.. ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్లపై దాడి.. ఇప్పుడు మళ్లీ ఒకే రాత్రి 12 మోటార్ కేబుళ్ల చోరీ.. ఇలా వరుసగా కాపర్నే లక్ష్యంగా చేసుకోవడం ఒకే ముఠా కదలికలకు బలమైన ఆధారంగా నిలుస్తోంది. పోలీసుల నిఘా కొనసాగుతున్నప్పటికీ దొంగలు వరుసగా చోరీలకు పాల్పడుతుండటంతో ఈ ముఠాను పట్టుకోవడమే ఇప్పుడు పోలీసులకు ప్రధాన సవాల్గా మారింది.

