గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం.. బెంగళూరులో కలకలం…
బెంగళూరు, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి):
బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని తాజ్ హోటల్లో ఇద్దరు మైనర్ బాలికలు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. వారి తండ్రి ఎస్జీ ఇమ్రాన్ (40) ఇద్దరినీ గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఇమ్రాన్ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బెంగళూరులోని బిలాల్ నగర్కు చెందిన ఇమ్రాన్ ఆదివారం సాయంత్రం తన కుమార్తెలు షేక్ జెహ్రా (5), షేక్ జోయా (10)తో కలిసి హోటల్లో గది తీసుకున్నాడు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో హౌస్కీపింగ్ సిబ్బంది తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో భద్రతా సిబ్బందితో కలిసి గదిలోకి వెళ్లారు. ఇద్దరు బాలికలు మంచంపై మృతిచెంది ఉండగా, ఇమ్రాన్ తీవ్ర గాయాలతో కనిపించాడు.
హోటల్ సిబ్బంది అతడిని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ఇమ్రాన్ క్యాబ్ కంపెనీలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలంలో లభించినట్లు చెబుతున్న ఓ నోట్లో భార్యాభర్తల మధ్య విభేదాలు, భార్యపై అనుమానాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ నోట్ నిజమైనదేనా, హత్యకు అదే కారణమా అనే విషయాలను పోలీసులు నిర్ధారిస్తున్నారు.
ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు హోటల్ గదిలోని ఆధారాలు, నోట్, ఇతర వివరాలను పరిశీలిస్తున్నారు. ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితి, దర్యాప్తులో వెలుగుచూసే అంశాల ఆధారంగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తేలాల్సి ఉంది.

