📄 ePaper
Wednesday, August 26, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కొండా సురేఖను కేబినెట్‌ నుంచి తొలగించాలని సిఫారసు !

కొండా సురేఖను కేబినెట్‌ నుంచి తొలగించాలని సిఫారసు !

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం.. చిన‍్నారెడ్డిపై కూడా చర్యలకు సిఫారసు

హైదరాబాద్‌, ఆగస్టు 25 (నవజ్యోతి ప్రతినిధి): తెలంగాణ మంత్రి కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖను రాష్ట్ర కేబినెట్‌ నుంచి తొలగించాలని, జి.చిన్నారెడ్డిని ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు సిఫారసు చేసినట్లు కాంగ్రెస్‌ వర్గాల సమాచారం.

ఢిల్లీకి నివేదిక.. తుది నిర్ణయం అధిష్ఠానానిదే

క్రమశిక్షణ కమిటీ నివేదికను మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు పంపనున్నారు. అనంతరం ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో సంప్రదించి మీనాక్షి నటరాజన్‌ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కూతురు వ్యాఖ్యలపై కమిటీ ఆరా

కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు, వాటిపై మంత్రి ఇచ్చిన వివరణను క్రమశిక్షణ కమిటీ పరిశీలించినట్లు సమాచారం. కుమార్తె వ్యాఖ్యల నుంచి తాను దూరంగా ఉన్నట్లు సురేఖ చెప్పినప్పటికీ, ఆ వివరణను కమిటీ ఆమోదించలేదని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

ఇది గత ఏడాదిలో చోటుచేసుకున్న రెండో ఘటనగా కమిటీ పరిగణించినట్లు సమాచారం. ఇటువంటి బహిరంగ వ్యాఖ్యల వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటోందని, తగిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

ఖర్గే భేటీలోనూ తీవ్ర అసంతృప్తి

కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన సందర్భంలోనూ ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగ వేదికలపై చర్చించవద్దని నాయకత్వం పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ, ఇలాంటి పరిణామాలు కొనసాగడంపై అధిష్ఠానం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

సురేఖకు మరో అవకాశం లేనట్టేనా?

పార్టీ వ్యవహారాలను బహిరంగంగా ప్రస్తావించకుండా ఉండాలని కింది స్థాయి నుంచి అగ్రస్థాయి నేతల వరకు స్పష్టమైన సూచనలు ఉన్నాయని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. సమస్యల పరిష్కారానికి పార్టీలో అంతర్గత వ్యవస్థ ఉన్నప్పటికీ, బహిరంగ వేదికలపై వ్యాఖ్యలు చేయడం పార్టీకి ఇబ్బందికరంగా మారుతోందని పేర్కొంటున్నాయి.

తాజా క్రమశిక్షణ కమిటీ సిఫారసుతో కొండా సురేఖ మంత్రి పదవిపై తుది నిర్ణయం అధిష్ఠానం చేతుల్లోకి వెళ్లింది. అయితే ఆమెను కేబినెట్‌ నుంచి తొలగించినట్లు ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!